మర్పల్లి, అక్టోబర్ 30 : తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని, మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోరారు. సోమవారం మండల పరిధిలోని సిరిపురం, వీర్లపల్లి, కొత్లాపూర్, కోట్మర్పల్లి గ్రామాల్లో మండల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేండ్ల క్రితం కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణలో 60 ఏండ్లలో చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ చేసి చూయించారని తెలిపారు.
కష్ట్టాలు పెట్టే కాంగ్రెస్ పాలన వద్దని, కేసీఆర్ పాలననే ముద్దని అన్నారు. సిరిపురంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కొత్లాపూర్లో ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్త ఉదండ ఎల్లయ్య మృతి చెందడంతో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు మల్లయ్య, సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ కళావతి ప్రకాశ్, విజయలక్ష్మీరాచయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్ గుప్తా, ఎంపీపీ లలితారమేశ్, జడ్పీటీసీ మధుకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అశోక్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మల్లేశం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కోట్పల్లి : ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా అనునిత్యం పనిచేసే ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ను మరోసారి ఆశీర్వదించాలని ఆయన సతీమణి సబిత కోరారు. సోమవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నారంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆనంద్ను మరోసారి గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సావిత్రీదశరథ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ధారూరు : బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పథకాలు ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతున్నాయని పార్టీ మండల నాయకులు తెలిపారు. సోమవారం ధారూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్కు మద్దతుగా వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆనంద్ ఎంతో కృషి చేశారని, అభివృద్ధిని చూసి ఆనంద్ను ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.