పట్టణాలు, పల్లెల అభివృద్ధి … పరిశ్రమలు, పర్యావరణం.. వ్యవసాయం, ఐటీ ఇలా.. అన్నిరంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి నమూనాను దేశం ముందు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వానిదే అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు. ఎల్బీ నగర్లో మంత్రి కేటీఆర్ నాగోల్ నుంచి బండ్లగూడ వరకు నిర్మించిన బాక్స్ డ్రైన్, ఫతుల్లాగూడ నుంచి పీర్జాదిగూడ లింక్ రోడ్డు, ముక్తిఘాట్, పెంపుడు జంతువుల శ్మశాన వాటికలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు.
నాగోల్- ఎల్బీ నగర్ మధ్య ఉన్న ఐదు కిలోమీటర్ల మెట్రో లింకు కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వరద ముంపు నివారణకు శాశ్వత పరిష్కారంగా రూ.985 కోట్లతో ఎస్ఎన్డీపీ పథకాన్ని చేపట్టి నాలాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్రెడ్డి చొరవతో ఎల్బీనగర్ రూపురేఖలు మారాయన్నారు. భారతదేశంలో మొట్టమొదటి పెట్ యానిమల్ క్రిమిటోరియం.. రంగారెడ్డి జిల్లాలోనే ప్రారంభించుకున్నామని తెలిపారు. మూసీపై కొత్తగా 14 వంతెనలను నిర్మించనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. మూడు జిల్లాల పరిధిలో ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు 118 జీవోను తీసుకొచ్చామని, ఈ నెల 20వ తేదీ వరకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించి సీఎం కేసీఆర్ నాయకత్వంలో అడిగినా అడగపోయినా పనిచేస్తున్నామని, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని మంత్రి కేటీఆర్ కోరారు.
సిటీబ్యూరో/మన్సూరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చి స్థిరపడుతున్నారని, తెలంగాణ, ఆంధ్ర ప్రజలే కాకుండా భారతదేశంలోని 28 రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధానంగా ప్రజారవాణాను విస్తరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మొదటి దశలో చేపట్టిన మెట్రో ఎల్బీనగర్, నాగోల్ వరకు పూర్తి చేశామని, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మిగిలిపోయిన 5 కి.మీ. మెట్రోను రెండో దశలో చేపడుతామని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ప్రజా రవాణాకు పెద్దపీట
ఎస్ఎన్డీపీ ద్వారా నాలాల అభివృద్ధి, రవాణా సౌకర్యం కోసం ఎస్ఆర్డిపీ పథకాలు, రోడ్ల నిర్వహణకు సీఆర్ఎంపీ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజా రవాణాకు కూడా పెద్దపీట వేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలో గల ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు రూ.55 కోట్ల విలువగల 5 అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
పలు అభివృద్ధి పనులు ప్రారంభం
ఎస్ఎన్డీపీ ద్వారా బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు రూ.7.26 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నాలాను ప్రారంభించారు. ఫతుల్లాగూడ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి వయా మహవీర్ హరిణి వనస్థలి నేషనల్ పారు మీదుగా పీర్జాదిగూడ వరకు రూ.26.50 కోట్లతో చేపట్టిన పీర్జాదిగూడ లింక్ రోడ్డును, ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో రూ.84 లక్షలతో ఏర్పాటు చేసిన పెంపుడు జంతువుల శ్మశానవాటికను, రూ.16.25 కోట్లతో ఏర్పాటు చేసిన హిందూ, క్రిస్టియన్ శ్మశానవాటిక, ముస్లింల కబరస్థాన్, వనస్థలిపురంలో స్విమ్మింగ్పూల్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాలాల సమస్యల పరిష్కారానికి ఎస్ఎన్డీపీ రెండో దశ పనులు చేపడుతామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మూసీపై కొత్తగా జీహెచ్ఎంసీ ద్వారా 14 వంతెనలను నిర్మించనున్నట్లు తెలిపారు.
అత్యాధునిక హంగులతో ముక్తిఘాట్
ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం రూపురేఖలు మారిపోయాయని.. అభివృద్ధిలో హైదరాబాద్ నగరం బెంగుళూరు సిటీని అధిగమించిందని తెలిపారు. ఫతుల్లాగూడలో అత్యాధునిక హంగులతో ముస్లిం, క్రిస్టియన్లు, హిందువుల కోసం ఆరున్నర ఎకరాల స్థలంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా ముక్తిఘాట్ను నిర్మించినట్లు వివరించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ముక్తిఘాట్ నిర్మాణం సాధ్యమైందని తెలిపారు. దేశంలో మరెకడా లేనివిధంగా పెంపుడు జంతువుల శ్మశానవాటిక ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో ఎల్బీనగర్లో ట్రాఫిక్ సమస్యలు తీరిపోయాయని.. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు కింద వందలాది కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్పాస్ రోడ్లను నిర్మించినట్లు తెలిపారు.
ఆటోనగర్ డంపింగ్ యార్డును ఒక అందమైన పూలవనంగా మార్చేందుకు ఒక వరం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ను ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు నవీన్కుమార్, సురభి వాణీదేవి, దయానంద్, శంబీపూర్ రాజు, నాగర్కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్లు ఉప్పల శ్రీనివాస్గుప్తా, రెడ్కో చైర్మన్ సతీష్రెడ్డి, టీఎస్ఐడీసీ చైర్మన్ లక్ష్మీనారాయణ, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్, సినీ నటి అమల, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్, జోనల్ కమిషనర్ పంకజ, నాగోల్ కార్పొరేటర్ అరుణ, హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ సుజాతనాయక్, వివిధ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు విఠల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, రాజశేఖర్రెడ్డి, సాగర్రెడ్డి, రమావత్ పద్మానాయక్, సంగీత, రమణారెడ్డి, విఠల్రెడ్డి, భవాని, తిరుమల్రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
హైదరాబాద్ నలువైపులా అభివృద్ధి
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. 8 ఏండ్ల ముందు హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు లేవని.. ఇప్పడు అవన్నీ ఏర్పాటు చేయడం మూలంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం నలువైపులా అభివృద్ధి జరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వెంట అందరూ నిలబడాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పచ్చదనంతో పూలవనం మధ్య శ్మశానవాటిన నిర్మాణాన్ని చేపట్టిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఆదర్శనీయుడని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం
పెద్దఅంబర్పేట, డిసెంబర్ 6 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలోని తట్టిఅన్నారం నుంచి ఫతుల్లాగూడ వరకు (ఫతుల్లాగూడ-పీర్జాదిగూడ లింక్) రోడ్డు ప్రారంభోత్సవానికి హాజరైన పురపాలకశాఖ మంత్రి తారకరామారావుకు టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఘన స్వాగతం పలికారు. పెద్దఎత్తున టీఆర్ఎస్ నాయకులు వెంట రాగా జై కేటీఆర్, జై తెలంగాణ నినాదాలు చేశారు. ప్రారంభోత్సవాల అనంతరం జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఫతుల్లాగూడ నుంచి పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలోని మర్రిపల్లి వరకు రోడ్డు వేయాలని మంత్రి కేటీఆర్ను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ రోడ్డుతో మర్రిపల్లితోపాటు ఆర్కేనగర్ ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని కిషన్రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు, రోడ్డు కోసం ప్రత్యేకంగా కృషిచేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి కౌన్సిలర్ అర్చన, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, కౌన్సిలర్లు రోహిణరెడ్డి, శ్రీధర్రెడ్డి, హరిశంకర్, రమావత్ పరశురాంనాయక్, కోటేశ్వర్రావు, నాయకులు బలరాం, ప్రభాకర్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, దామోదర్, జగన్, గోపాల్గౌడ్, భిక్షపతి పాల్గొన్నారు.