జీడిమెట్ల, మే 26 : జీడిమెట్ల, గాంధీనగర్ పారిశ్రామిక వాడలలో హమాలీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ఆధ్వర్యంలో సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక సంఘాలతో కలిసి సుమారు 400 మంది కార్మికులు మంత్రి మల్లారెడ్డి నివాసంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సర్వే నంబర్ 79 లో ఉన్న ప్రభుత్వ స్థలంలో హమాలీ భవనం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి మల్లారెడ్డికి వినతి పత్రం అందజేశారు.
అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి హమాలీ భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కీలుకాని లక్ష్మణ్, బీరప్ప, హరినాథ్, స్వామి, దేవదానం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.