బొంరాస్పేట, జూలై 23 : వికారాబాద్ జిల్లాలో కొత్తగా మరో మండలం ఏర్పాటైంది. బొంరాస్పేట మండలంలోని దుద్యాల కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలో మండలాల సంఖ్య 20కి చేరింది. పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు సమయంలో మండలంలోని దుద్యాలను కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. 2018లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పట్నం నరేందర్రెడ్డి దుద్యాల మండల ఏర్పాటుకు, కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో మండలం నుంచి కోస్గి మండలంలో కలిసిన హకీంపేట, పోలేపల్లి గ్రామాలను కూడా తిరిగి బొంరాస్పేటలో కలుపుతామని హామీ ఇచ్చారు. కొత్త మండలం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ను కోరారు. సీఎం కేసీఆర్ అంగీకరించడంతో దుద్యాల మండలం ఏర్పాటుకు గత ఏడాది జూలై 22న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. సరిగ్గా ఏడాది తరువాత దుద్యాలను మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నేడు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో బొంరాస్పేట మండలంలోనే ఉండి జిల్లాల విభజన సమయంలో కోస్గి మండలంలోకి వెళ్లిన హకీంపేట, పోలేపల్లి గ్రామాలు కూడా వికారాబాద్ జిల్లాలోకి రావడంపై రెండు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
12 గ్రామాలతో దుద్యాల మండలం
12 గ్రామాలతో దుద్యాల మండలాన్ని ఏర్పాటు చేశారు. వీటిలో బొంరాస్పేట మండలంలోని దుద్యాల, లగచెర్ల, ఈర్లపల్లి, గౌరారం, చిల్ముల్మైలారం, మాచన్పల్లి, నాస్కంపల్లి, హంసాన్పల్లి, దౌల్తాబాద్ మండలంలోని కుదురుమల్ల, కొడంగల్ మండలంలోని ఆలేడు, నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని హకీంపేట, పోలేపల్లి గ్రామాలున్నాయి. వీటిలో పోలేపల్లి, హకీంపేట గ్రామాలు కొత్త జిల్లాలు ఏర్పడక ముందు బొంరాస్పేట మండలంలోనే ఉండేవి. మళ్లీ ఇవి ఇప్పుడు దుద్యాల మండలంలోకి చేరుతున్నాయి. ఆలేడు, కుదురుమళ్ల గ్రామాలు దుద్యాల గ్రామానికి దగ్గరగా ఉంటాయి. దుద్యాల మండలంలో తమ గ్రామాలను కలుపాలని రెండు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేను కోరారు. వారి కోరిక మేరకు వీటిని దుద్యాలలో కలుపుతున్నారు. కొత్తగా ఏర్పడ్డ దుద్యాల మండల జనాభా 20,510.
కొడంగల్ నియోజకవర్గంలో మరో రెండు కొత్త మండలాలు
కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాలతోపాటు కొత్తగా మరో రెండు మండలాలు ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం గుండుమాల్ను, మద్దూరు మండలంలోని కొత్తపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన మండలాలతో కలిపి నియోజకవర్గంలో మండలాల సంఖ్య ఎనిమిదికి చేరింది.
ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది: చాంద్పాషా, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, బొంరాస్పేట
దుద్యాల మండలం ఏర్పాటుతో గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. బొంరాస్పేట మండలానికి రావాలంటే కొన్ని గ్రామాల ప్రజలకు దూరమయ్యేది. రవాణా సౌకర్యం ఉండేది కాదు. దుద్యాల మండలం ఏర్పాటుతో ఇబ్బందులు తొలగిపోయాయి. కొత్త మండలం ఏర్పాటుకు కృషిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు.
– వెంకటేశ్, పోలేపల్లి ఎల్లమ్మ ఆలయ చైర్మన్
దుద్యాల మండలం ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు. పోలేపల్లి, హకీంపేట గ్రామాలను వికారాబాద్ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యేను కోరాం. మా విన్నపాన్ని అంగీకరించి రెండు గ్రామాలను జిల్లాలో కలిపారు. దుద్యాల మండలం మాకు సౌకర్యంగా ఉంటుంది.