ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 4 : క్రమ శిక్షణ, పట్టుదలతో కృషి చేసి ప్రతి ఒక్కరు ఉద్యోగాలు సంపాదించాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మండల పరిధి అవుషాపూర్ లోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో పోలీసు ప్రీ రిక్రుట్మెంట్ ట్రైనింగ్ను బుధవారం ఆయన ప్రారంభించారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పీజేఆర్ ఇనిస్టిట్యూషన్ సౌజన్యంతో మూడు నెలల పాటు ఉచిత శిక్షణను అందించనున్నట్లు తెలిపారు.
ఘట్కేసర్తో పాటు ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నంలో 2000 మంది అభ్యర్థులకు ఉచితంగా పోలీసు ఉద్యోగాల సాధనకై ఉచితంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం 10 వేలకు పైగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయని, అందులో 8 వేల మందికి పరీక్షలు నిర్వహించగా రెండు వేల మంది అభ్యర్థులు అత్యంత ప్రతిభను కనబరుచడంతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలతో పాటు ఇతర శాఖలలో ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ జారీ చేసినందున ప్రతి ఒక్కరు తమ ప్రతిభా పాటవాలతో ఉద్యోగాలను సాధించాలన్నారు. ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని పట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితాలు తప్పకుండా వస్తాయన్నారు.
కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి, అడిషనల్ డీసీపీ కుషాయిగూడ శివకుమార్, డీసీపీ ఏఆర్ హెడ్క్వార్టర్స్ షమీర్, అడిషనల్ డీసీపీ లక్ష్మినారాయణ, అరోరా కళాశాల ప్రిన్సిపల్ మహేష్, పీజేఆర్ ఇనిస్టిట్యూషన్ హెడ్ జనార్దన్ రెడ్డి, ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.