కుత్బుల్లాపూర్, ఆగస్టు 18: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సాగుతున్న రోడ్ల నిర్మాణ పనులను హెచ్ఎండీఏకు బదలాయించాలని కోరుతూ బుధవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మంత్రి కేటీఆర్కు విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి నుంచి గండిమైసమ్మ వరకు ఉన్న ఇంటర్ మీడియన్ రింగ్రోడ్డు, బహదూర్పల్లి నుంచి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు ఆర్అండ్బీ పరిధిలోని రోడ్డును హెచ్ఎండీఏకి బదలాయించి త్వరితగతిన అభివృద్ధి చేయాలని కోరామని తెలిపారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఈ మార్గంలో సాగే పనులు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఇందుకు మంత్రి కేటీఆర్ స్పందించి రోడ్ల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.