మేడ్చల్ మల్కాజ్గిరి : పల్లె ప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. పుట్టి పెరిగిన ఊరి రుణం ప్రతి ఒక్కరు తీర్చుకోవాలని అయన కోరారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలంలోని డబిల్పూర్ గ్రామంలో శుక్రవారం నాడు జరిగిన పల్లె ప్రగతి గ్రామ సభలో మంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాలు పరిశుభ్రత, పచ్చదనంతో వెల్లివిరియాలని, అభివృద్ధిలో ముందంజలో నిలవాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొని కష్టపడి పనిచేస్తే గ్రామాల రూపురేఖలే మారిపోతాయన్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ చేసి చూపించారని పేర్కొన్నారు.
మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి మాట్లాడుతూ.. పచ్చదనం, పరిశుభ్రత ప్రధాన అంశాలుగా పల్లె ప్రగతి కార్యక్రమం అమలు జరుగుతుందన్నారు. ప్రతి వ్యక్తి తమ ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటారో అదే విధంగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యాoసన్, ఎంపీపీ శైలాజ, జిల్లా అధికారులు, మండల, గ్రామస్థాయి అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.