మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 30 : కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ప్రతాపం చూపడుతోంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలు సమరం సాగిస్తున్నాయి. పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. సర్పంచ్లు నిరంతర పర్యవేక్షణతో కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు భరో సా కల్పిస్తూనే విస్తరణకు అడ్డుకట్ట వేస్తున్నారు.
మేడ్చల్ మండలంలో 17 పంచాయతీలు ఉన్నాయి. మొదటి దశలో గ్రామ పంచాయతీల్లో పెద్దగా కరోనా కేసులేమి నమోదు కాలేదు. ఒకటి, రెండు, గరిష్టంగా పదిలోపే నమోదయ్యాయి. మెజార్టీ గ్రామాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ సెకండ్ వేవ్లో కరోనా విజృంభించింది. గ్రామాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఒక్క డబిల్పూర్లోనే 200వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృత్యువాత పడ్డారు. మునీరాబాద్లో 63కేసులు వచ్చాయి. డబిల్పూర్, మునీరాబాద్, బండమాదారం, మునీరాబాద్, రాయిలాపూర్, నూతన్కల్, ఎల్లంపేట, రాజబొల్లారం, గౌడవెల్లి, సోమారం తదితర గ్రామాలు కరోనా బారిన పడ్డాయి. ప్రతి రోజు 14నుంచి 30వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రెండో దశలో మైసిరెడ్డిపల్లి, కోనాయిపల్లి తదితర చిన్న పంచాయతీలు సైతం కరోనా బారిన పడ్డాయి.