నేరేడ్మెట్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి (Marri Rajashekar Reddy) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు,కార్యకర్తలు పెద్దసంఖ్యలో భారీ ర్యాలీ నిర్వహించారు. మౌలాలి నుంచి ప్రారంభమైన ర్యాలీ వినాయకనగర్, సఫిల్గుడ, ఆనంద్బాగ్,మల్కాజిగిరి చౌరస్తాల మీదుగా మీర్జాల్గుడ వరకు కొనసాగింది.
కేసీఆర్(CM KCR) ప్రభుత్వానికి అండగా నిలబడాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని నినాదాలు చేశారు. దీంతో ఆయా ప్రాంతాలన్నీ గులాబీ మయంగా మారాయి. అభ్యర్థి రాజశేఖరరెడ్డి దారిపొడవున ప్రజలను పలకరిస్తూ, అభివాదాలు చేశారు. మీర్జాలగుడ చౌరస్తా వరకు కొనసాగిన ర్యాలీ అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిన మైనంపల్లి హన్మంతరావు(Hanmanth Rao) కు ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్ద పీఠ వేసిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉన్నారని, ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రధాన సమస్యలన్నిటీ తాను గెలిచిన తరువాత పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని, కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని ఆయన కోరారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4వందలకే వంట గ్యాస్ను సరఫరా, సౌభాగ్య లక్ష్మి పథకం ఇంద ప్రతి మహిళకు నెలకు రూ.3వేల నగదు అందజేయనున్నట్టు ముఖ్యమ్రంతి కేసీఆర్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ప్రాణ త్యాగాలు, ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి పాటుపడుతున్న కేసీఆర్ను దీవించాలని రాజశేఖరరెడ్డి ప్రజలను కోరారు.