మేడ్చల్, మే 12: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేతో మేడ్చల్ నియోజకవర్గంలో సత్ఫలితాలిస్తున్నాయి. ఇంటి వద్దే జ్వరం, జలుబు, దగ్గు తదితర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తించి వారికి మెడికల్ కిట్లను అందజేయడంతో కరోనా కట్టడి జరుగుతున్నది. ఇప్పటికే గ్రామాల్లో చివరి దశకు చేరుకోగా, మున్సిపాలిటీల్లో కొనసాగుతున్నది.
మేడ్చల్ కలెక్టరేట్, మే 12: నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో ఇంటింటి సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో కౌన్సిలర్ కొత్త హేమలత శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఫీవర్ సర్వేను నిర్వహించారు. కార్యక్రమంలో 3వ వార్డు అధ్యక్షుడు శ్యామ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, కార్తీక్ గౌడ్, రాంబాబు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
కీసర, మే 12: కరోనాను కట్టడి చేసేందుకు ఫీవర్ సర్వేకు ప్రజలు సహకరించాలని ఎంపీడీవో పద్మావతి కోరారు. తిమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది,పంచాయతీ సిబ్బందితో కలిసి ఇంటింటి జ్వర సర్వేను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీవో మంగతాయరు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ, మే12: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్లో ఆరోగ్య సిబ్బంది జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలతో ఉన్న వారిని గుర్తించి మందులు, మాస్కులు అందజేస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్ : మండల పరిధిలోని గుండ్లపోచంపల్లి జ్వరం సర్వే కొనసాగింది. బుధవారం 19 సర్వే బృందాలు 715 కుటుంబాలను సర్వే చేసి, 28 మంది కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించాయి. 28 మంది కిట్లను పంపిణీ చేశారు. మండల పరిధిలో 4,690 కుటుంబాలను సర్వే చేసి, 228 కరోనా లక్షణాలు ఉన్న వారికి గుర్తించి, కిట్లను అందజేశారు.