దుండిగల్, ఆగస్టు : దుకాణదారులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్ బిన్లలోనే వేయాలని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్లు సూచించారు. పారిశుధ్య నిర్వహణ డ్రైవ్లో భాగంగా సోమవారం ఉదయం ఆయన మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలల్లో రహదారుల స్వీపింగ్ పనులను పర్యవేక్షించారు. కార్మికుల బయోమెట్రిక్, హాజరు పట్టీలను పరిశీలించారు. రహదారులకు ఇరువైపుల ఉన్న మట్టి, పిచ్చి మొక్కలను తొలగించారు. అదే విధంగా దుకాణ దారులను కలిసిన ఆయన చెత్తను డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకొని అందులోనే వేయాలని సూచించారు.
తడి, పొడి చెత్తను వేర్వేరు డస్ట్బిన్లల్లో వేయాలన్నారు. లేని పక్షంలో జరిమాన విధిస్తామని హెచ్చరించారు. ఇండ్లల్లోంచి వచ్చే చెత్తను సైతం చెత్తవాహనాల్లోనే వేయాలన్నారు. మురుగునీరు నిలువ ఉండే ప్రదేశాలల్లో ఈగలు, దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, యాంటీ లార్వా మందును పిచికారి చేయాలని, సాయంత్రం తప్పని సరిగా ఫాగింగ్ చేయాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. అనంతరం హరితహరంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కలకు రోజూ నీరు పోయాలని, ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.