కీసర: తెలంగాణ ప్రభుత్వంలో రైతాంగానికి అధిక మొత్తంలో పంట రుణాలందిస్తున్నామని కీసర మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో గురువారం 34 మంది రైతులకు పంట రుణాల కింద రూ.21.60లక్షల రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకొన్న రైతులందరికీ పంట రుణాలిస్తున్నామన్నారు. ప్రతి సీజన్లో రైతులకు రుణాలందించి అండగా ఉంటున్నామని ఆయన అన్నారు.
మండల ప్రాథమిక సహకార సంఘం నుంచి పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు, మార్టుగేజ్ రుణాలను కూడా అందిస్తున్నామన్నారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు సాగుచేసినప్పటి నుంచి పంట చేతికొచ్చిన తరువాత ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు డబ్బులు అందిస్తుందన్నారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అండగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పన్నాల బుచ్చిరెడ్డి, సహకార సంఘం సీఈఓ కృష్ణారెడ్డి, రాగుల నరహరి తదితరులు పాల్గొన్నారు.