కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 5: ప్రేమ విషయంలో ఓ అమ్మాయి నిరాకరించడంతో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా గురుమూర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం నాగరాజు (22) గత కొంతకాలం కిందట నగరానికి వలస వచ్చి జీడిమెట్ల బ్యాంకు కాలనీలో తన స్నేహితులతో కలిసి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
కాగా, ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. చివరకు అమ్మాయి తన ప్రేమను నిరాకరించింది. దీంతో మనస్థాపనికి గురైన నాగరాజు శుక్రవారం రాత్రి తాను ఉంటున్న ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.