మేడ్చల్, మే 19 : మేడ్చల్ పోలీస్స్టేషన్(Medchal) పరిధిలో ఐదు రోజులు గడవక ముందే మరో దారుణ హత్య జరిగింది. తన మంచిని కోరిన వ్యక్తిని నడిరోడ్డులో అందరూ చూస్తుండగా మరో వ్యక్తి బంధుత్వాన్ని కూడా మరిచి కత్తితో పొడిచి(Brutal murder) చంపాడు. ఈ దారుణ ఘటన సోమవారం ఉదయం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మేడ్చల్ పట్టణంలోని రైల్వేస్టేషన్ను పక్కనే ఉన్న సరస్వతీనగర్లో గుజరాత్కు చెందిన సోలంకి మోతీలాల్(43) అద్దె ఇంట్లో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే చోట మరో ఇంట్లో తన మేనత్త కొడుకు అయిన శంకర్(35) నివాసం ఉంటున్నాడు. శంకర్ ఆదివారం మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ తన నివాస గృహానికి పక్కనే ఉండే రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం మీదికి వెళ్లి పడుకున్నాడు.
ఇది గుర్తించిన మోతీలాల్ మరో వ్యక్తితో కలిసి శంకర్ వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులతో గొడవ పడవద్దని నచ్చచెపుతూ అక్కడి నుంచి తీసుకువచ్చి, ఇంట్లో దిగపెట్టాడు. ఈ సందర్భంగా ఇరువురి మద్యం వాగ్వివాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న శంకర్ మంచి చెపుతున్న మోతీలాల్ను దుర్భాషలాడాడు. మద్యం తాగి ఉన్నందున అతడిని ఏమి అనకుండా తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. మరుసటి రోజు సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతాలో మోతీలాల్ పనికి వెళ్లేందుకు సిద్ధపడుతూ ఏదో పని ఉండి పక్కనే ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్తుండగా శంకర్ రాత్రి విషయాన్ని మనస్సులో పెట్టుకొని, దుర్బాషలాడటం ప్రారంభించాడు.
ఈ విషయాన్ని అతడి తల్లికి చెపుదామని వెళ్తుండగా ఆవేశంతో శంకర్ వెనుక నుంచి వచ్చి మోతీలాల్ను కత్తితో కడుపులో, వీపులో ఎక్కడ పడితే అక్కడ పొడిచాడు. స్థానికులు అరుస్తూ అతడిని అడ్డుకునేలోపే పొడిచి, పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ మోతీలాల్ను108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలిస్తుండగానే మార్గంమధ్యలో మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న సీఐ సత్యనారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి భార్య మీనా, కుటుంబ సభ్యులను హత్యా ఘటనపై విచారించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల బృందాలను కేటాయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.