మేడ్చల్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : సఫాయి కర్మచారుల (కార్మికుల) అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సఫాయి కర్మచారుల (కార్మికుల) జాతీయ కమిషన్ సభ్యురాలు అంజన పర్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశం హాల్లో సఫాయి కర్మచారుల(కార్మికుల) అభివృద్ధికి అందిస్తున్న పథకాల, అమలు తీరుపై జిల్లా అధికారులతో అంజన పర్వాన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పథకాలు సకాలంలో కార్మికులకు అందుతున్నాయా ?లేదా? అన్న విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికులకు వేతన స్లిప్లతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, బీమా అందజేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్లు కమిషన్ సభ్యురాలు అంజన పర్వాన్కు వివరించారు. సఫాయి కర్మచారులకు రుణాలు, డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయించాలని కార్మికుల సంఘం ప్రతినిధులు కోరారు. దీనికి స్పందించిన కమిషన్ సభ్యురాలు ఇండ్లను మంజూరు చేయించేందుకు ప్రత్యేక కోటాను కేటాయించాలన్నారు.
సఫాయి కార్మికులు నివసించే ప్రాంతాల్లో ఏడాదికి రెండుసార్లు వైద్య శిబిరాలు నిర్వహించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జాతీయ కమిషన్ సభ్యురాలు అంజన పర్వాన్ ఆదేశించారు. వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్మికుల పిల్లలు చదువుకు నేందుకు వారికి అవగాహన కల్పించి వసతి గృహాల్లో చేర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్యాంసన్, డీఆర్వో లింగ్యానాయక్, మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మున్సిపల్ కమిషనర్లు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
కీసర, జూన్ 24 : కీసరగుట్ట శ్రీభవానీ రామలింగేశ్వర స్వామిని సఫాయి కర్మచారుల (కార్మికుల) జాతీయ కమిషన్ సభ్యురాలు అంజన పర్వాన్ దర్శించుకున్నారు. గురువారం ఆమె కీసరగుట్ట ఆలయానికి చేరుకోగా ఆలయ కమిటీ చైర్మన్ తటాకం నాగలింగంశర్మ వేదపండితులతో కలిసి ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఆమె స్వామివారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగ ణంలో చైర్మన్ ఆమెను సత్కరించారు. జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, కీసరగుట్ట ఈఓ సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.