సిద్దిపేట, ఏప్రిల్ 28(నమసే తెలంగాణ ప్రతినిధి) : ‘పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. కేసీఆర్ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటాను. నిండు మనస్సుతో దీవిస్తే ప్రజల కష్టసుఖాల్లో తోడుంటాను. మన ప్రాంతంపై ఉన్న ప్రత్యేక ప్రేమతో అందరికీ విస్తృత సేవలను అందించాలనే సంకల్పంతో ఎంపీగా పోటీలో నిలిచా’..అని మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పీ వెంకట్రామిరెడ్డి అన్నారు. గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శకంలో, మాజీ మంత్రి హరీశ్రావు నాయకత్వంలో మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో చాలా అభివృద్ధి జరిగిందని చెప్పారు. తాను వ్యక్తిగతంగా రూ. 100 కోట్లతో ట్రస్టును ఏర్పాటు చేసి, యువతకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఉద్యోగ మేళాలు నిర్వహిస్తానని హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ…
ప్రజల నుంచి స్పందన ఎలా ఉన్నది..?
ప్రజల ఆదరణ ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కలెక్టర్గా పని చేసిన అనుభవం ఉంది. ప్రతి సమస్య తెలిసిన వ్యక్తిని. ప్రతి గ్రామంలో వంద మందిని పేరు పెట్టి పిలిచేంత పరిచయాలు ఉన్నాయి. ఒక అధికారిగా నన్ను ఆదరించారు. ఇవ్వాళ ఆశీర్వదిస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. పార్టీ పటిష్టంగా ఉంది. క్యాడర్ సైనికుల్లా పనిచేస్తున్నారు. అందరి సహకారంతో మెదక్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలుస్తాను. అన్ని మండల కేంద్రాల్లో సన్నాహక సమావేశాలతోపాటు రోడ్ షోలు నిర్వహిస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. గ్రామాల్లో గులాబీ సైన్యం ఇంటింటా ప్రచారం ప్రారంభించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. మా వెంకట్రామన్న కలెక్టర్గా బాగా పని చేసిండు..ఎంపీగా అయితే మరింతగా పనిచేస్తాడన్న ఉత్సాహంతో ముందుకు పోతున్నారు. క్యాడర్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్గదర్శనం చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్రావు నాయకత్వంలో ముందుకుపోతున్నాం. టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలు ఇస్తున్నారు. ఖచ్చితంగా విజయం మాదే.
కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న విమర్శలపై మీ కామెంట్..?
మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్కు మంచి మెజార్టీ వచ్చింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుంది. ప్రతి ముంపు కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని.. వాళ్ల సమస్యలన్నీ పరిష్కరించిన వ్యక్తిని.. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఆర్అండ్ఆర్ కాలనీలు నిర్మించాం. ముంపు భాదితులకు పరిహారం ఇచ్చి ఆదుకున్నాం. రిజర్వాయర్ల నిర్మాణం కోసమే భూసేకరణ చేశాం. ఇవ్వాళ ఈ రిజర్వాయర్ల ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరు అందింది.
మీరు చేయాలనుకున్న సేవా కార్యక్రమాలు వివరిస్తారా..?
రూ.100కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన విద్య, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఉద్యోగమేళాలతో యువత కలలు సాకారం చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇక్కడ ఎక్కువమందికి ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగావకాశాలు రావాలనేది నా తపన. హైదరాబాద్తోపాటు ఇతర నగరాల్లో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి తర్ఫీదునిస్తాను. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి శాసనసభ నియోజకవర్గపరిధిలో ఒక ఫంక్షన్హాల్ నిర్మాణం చేస్తాను. పేదలకు రూపాయి ఖర్చుతో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తాను. పెండ్లి భారం కావద్దని ఆడపడుచుల కుటుంబాలకు అండగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులను వందకు వంద శాతం ప్రజల అవసరాలు తీర్చడానికి ఖర్చు చేస్తాను. ఎంపీగా గెలిచాక వచ్చే జీతం ఒక్క పైసా సొంతానికి వాడుకోకుండా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాను. ఉన్నత చదువులు చదివిన నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 ఏండ్ల పాటు ఒక అధికారిగా, కలెక్టర్గా సేవలందించాను. ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో సిద్దిపేట జిల్లాను దేశంలోనే అగ్రగామిగా నిలిపాను.
పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తారా..?
మెదక్ ప్రాంతంలో కలెక్టర్గా చేసిన అనుభవం ఉంది. ఎక్కడ ఏం అభివృద్ధి కావాలో నాకు ఒక విజన్ ఉంది. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి మరిన్ని పరిశ్రమలు అవసరం. రాజీవ్ రహదారి వెంబడి మరిన్ని విద్యాసంస్థలు తీసుకువస్తాను. మెదక్ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ ఆలోచనలు, హరీశ్రావు నాయకత్వంలో విద్య, పరిశ్రమలు, ఉపాధి ఇవన్నీ మరింతగా అభివృద్ధి చేయాలన్నదే నా ఆలోచన. ఎంపీ అయ్యాక ట్రస్టు ద్వారా నెల రోజుల్లో కార్యక్రమాలను ఆవిష్కరిస్తాను.
మీ ప్రత్యర్థుల గురించి మీరు ఏమంటారు..?
ప్రజలు నన్ను ఒక అధికారిగా ఆదరించారు. ప్రధాన పార్టీల్లో ఒక అభ్యర్థి కేవలం గెలుపు కోసమే నాలుగు నెలల్లో నాలుగు పార్టీలు మారారు. మూడు నెలల కిందట ఒక పార్టీ నుంచి ఓటు అడిగాడు. మళ్లీ ఇంకో పార్టీ నుంచి ఓటు అడుగుతున్నాడు. ఇంకో అభ్యర్థి మొన్నటి శాసనసభఎన్నికల్లో దుబ్బాకలో ఘోర పరాజయం అయ్యాడు. నిరుద్యోగ భృతి , బీడీ కార్మికులకు పెన్షన్ అన్నాడు..? రైతులకు ఎడ్లు నాగలి ఇస్తాను అన్నాడు..? ఇవన్నీ ఏవీ ఇయ్యలేదు. టెక్స్టైల్ పార్క్, రైల్వే లైన్ ఇలా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి చివరికి ప్రజలను మోసం చేసిన వ్యక్తి. ఈ మోసాలను ప్రజలు గుర్తించి దుబ్బాక ఎన్నికల్లో ధీటైన సమాధానం ఇచ్చారు. నేను ఏవి చేయగలుగుతానో వాటిని మాత్రమే ప్రజలకు హామీలు ఇస్తున్నాను. నేను చేయాలనుకున్నది ప్రజలకు చెప్పి ఓట్లు అడుగుతున్నాను. గెలుపు కోసం తప్పుడు వాగ్దానాలు చేయాల్సిన అవసరం లేదు. హుందాగా రాజకీయాలు చేయాలి. అసత్య ప్రచారాలు మానుకొని ఒక్కరిని ఒక్కరూ దుర్భాషలాడి ప్రజల్లో చులకన కావొద్దు. ఒక మంచి అభ్యర్థిగా ప్రజల్లో ఉండాలన్నదే నా కోరిక.