వికారాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి బ్రేక్ పడింది. వికారాబాద్ జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మొదటి విడుతలో ఎంపికైన బడుల్లో దాదాపుగా అన్ని స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్లు రూ.10 కోట్ల బిల్లుల చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల విడుదలకు సుముఖంగా లేకపోవడంతో చెల్లింపుల ప్రక్రియ పెండింగ్లో పడింది.
మరోవైపు పనులు పూర్తై నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి పనులను పూర్తి చేసిన చిన్న కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి విడుతలో ప్రభుత్వం 371 స్కూళ్లను ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ఎంపిక చేయగా.. 20 స్కూళ్లలో పనులు పూర్తికాగా వాటిని ఇప్పటికే అధికారులు ప్రారంభించారు. కాగా 347 స్కూళ్లలో 20 శాతం మేర పనులు పూర్తయ్యాయి. సంబంధిత పనులకు సంబంధించి రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘మన ఊరు-మన బడి’ స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ ప్రోగ్రాంలో గతంలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా పనులను ప్రారంభించిన స్కూళ్లు కాకుండా కొత్త బడులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 20 శాతం వరకు పనులు పూర్తైన స్కూళ్లు కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో కొత్త స్కూళ్లను ఎంపిక చేస్తుండడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తున్నది. సగం వరకు పనులు పూర్తైన బడులను ఎంపిక చేసి త్వరగా వసతులు కల్పిస్తే పిల్లలకు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. కార్పొరేట్ బడులకు దీటుగా రూపుదిద్దుకున్నాయి. మొదటి విడుతలో మండలానికి, మున్సిపాలిటీకి రెండు చొప్పున ప్రభుత్వ బడులను ఎంపిక చేసి ఇప్పటివరకు జిల్లాలోని 20 ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించారు. తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్బోర్డులు, పెయింటింగ్, ప్రహరీలు, కిచెన్షెడ్లు, శిథిలమైన తరగతి గదుల స్థానం లో కొత్తవి నిర్మాణం,
మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు వంటి వసతులు కల్పించారు. జిల్లాలో 1054 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటి లో మొదటి విడుతలో 371 బడుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అప్పటి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడుతలో ఎంపికైన స్కూళ్ల లో ఉన్నత పాఠశాలలు-111, ప్రాథమికోన్నత పాఠశాలలు-40, ప్రాథమిక పాఠశాలలు-220 ఉన్నాయి.