శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 28 : చేవెళ్ల ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపునకు కృషి చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సూచించారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని పాలమాకుల, ముచ్చింతల్, ఘాన్సీమియాగూడ గ్రామాలకు చెందిన బూత్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో తన నివాసం వద్ద ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల ఎంపీగా కాసాని గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కాసాని గెలిస్తేనే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని వివరించారు. బీసీ నాయకుడిని గెలిపించి కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలన్నారు.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజేంద్రనగర్ నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని.. అందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు వేసేలా చూడాలన్నారు. జాతీయ పార్టీలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీలకు ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేవెళ్ల పార్లమెంట్కు ఎలాంటి అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వలేదని విమర్శించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి పనులు తప్ప చేసిందేమీలేదని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు 15 రోజుల పాటు సైనికుల్లా పనిచేసి అభ్యర్థి కాసానిని గెలిపించాలన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, నాయకులు రాజుముదిరాజ్, జగన్గౌడ్, రవీందర్నాయక్, కృష్ణయ్యగౌడ్, రాంనాథ్ ముదిరాజ్, శ్రీధర్గౌడ్, శివరాంనాయక్, నరేశ్గౌడ్ పాల్గొన్నారు.
మణికొండ : చేవెళ్ల గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసి బీసీల సత్తా చాటుదామని మండల మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్ముదిరాజ్ అన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆదివారం నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ సతీమణి చంద్రకళ, కుమారుడు సాయి, పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా మహిళలకు బొట్టు పెట్టి తన భర్తను గెలిపించాలని చంద్రకళ ఓటర్లను అభ్యర్థించారు. బడుగు బలహీన వర్గాల కోసం శక్తివంచన లేకుండా పని చేస్తున్న కాసానిని చేవెళ్ల గడ్డపై గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మల్లేశ్ అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు భిక్షపతి, కృష్ణ పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మణికొండ మున్సిపల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మణికొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వార్డులవారీగా నాయకులు, కార్యకర్తలు పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీరాములు, కుమార్, లక్ష్మణ్, జయరాజ్, భరత్రెడ్డి పాల్గొన్నారు.