Phone Snatching | సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): స్నాచింగ్ చేసిన సెల్ఫోన్లను తక్కువ ధరకు జగదీశ్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. ఈ ఫోన్లను ప్రతి 15 రోజులకొకసారి సూడాన్కు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కోసారి వెయ్యి, రెండు వేల ఫోన్లను ముంబై పోర్టు నుంచి అడ్డదారిలో కంటైనర్ల ద్వారా సూడాన్ దేశానికి తరలిస్తున్నారు. ఇటీవల సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అంతర్జాతీయ సెల్ఫోన్ చోరీ రాకెట్ను వెలుగులోకి తెచ్చి.. 12 మంది స్వదేశీయులు, ఐదుగురు సూడాన్ దేశస్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 703 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సెల్ఫోన్లు సూడాన్ దేశస్తుల వద్దకు ఎలా చేరుతున్నాయి.. సూడాన్ దేశస్తులు ఎలా వాటిని తమ దేశానికి తరలిస్తున్నారు.. అనే అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి.
సికింద్రాబాద్కు చెందిన మహ్మద్ ముజిమిల్ అలియాస్ ముజ్జు, అతడి స్నేహితుడు సయ్యద్ అబ్రార్తో పాటు మరో 10 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠాలోని కొందరు సెల్ఫోన్లు దొంగిలించగా.. మరికొందరు ఆ ఫోన్లను జగదీశ్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ ముఠా రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని, సెల్ఫోన్లను లాక్కుని పారిపోతుంది. ఇదిలా ఉండగా.. బిజినెస్ వీసాపై భారత్కు వచ్చిన సూడాన్ దేశానికి చెందిన ఖలీద్ అదెనబాగి మహ్మద్ అల్బద్వి మాసబ్ట్యాంక్లో సెల్ఫోన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అతడు వీసా గడువు పూర్తయిన సూడాన్కు చెందిన మరో నలుగురితో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేశాడు.
నేడు చాలా మంది రూ.15 వేల నుంచి 20 వేలు.. అంతకంటే ఎక్కువ విలువైన ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. నేరగాళ్లు కొట్టేసిన ఫోన్లలో చాలా వరకు బ్రాండెడ్ ఫోన్లు ఉంటున్నాయి. స్నాచింగ్ చేసిన సెల్ఫోన్లను విక్రయించేందుకు నేరగాళ్లు జగదీశ్ మార్కెట్కు వెళ్లగానే.. అక్కడ ఈ ఫోన్లు కొనుగోలు చేసే ముఠాలు ఉంటున్నాయి. సెల్ఫోన్ విలువ రూ.15 వేలు ఉంటే, దానిని రూ.5 వేల నుంచి 7 వేల వరకు స్నాచర్స్ విక్రయిస్తున్నారు.
ఈ ఫోన్లను రూ.7 నుంచి 9 వేల వరకు సూడాన్ దేశస్తులకు ముఠా సభ్యులు విక్రయిస్తున్నారు. సూడాన్ దేశస్తులు ఇక్కడ కొనుగోలు చేసిన ఫోన్లను.. ఒక లాట్గా తయారు చేస్తున్నారు. సూడాన్ ముఠా.. దేశ వ్యాప్తంగా దొంగిలించిన ఫోన్లను కొనుగోలు చేసే నెట్వర్క్ను నిర్వహిస్తున్నది. దీంతో 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే 1000 నుంచి 2000 వేల కంటే ఎక్కువగానే ఫోన్లు జమ చేస్తున్నారు. ఈ ఫోన్లను ముంబై విమానాశ్రయం ద్వారా అడ్డదారిలో సూడాన్ దేశానికి తరలిస్తున్నారు.