Hyderabad | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 27 : మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో శిక్షణ పొందుతూ.. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో దొంగతనాలు చేస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కేపీహెచ్బీ కాలనీ పరిధిలో దొంగిలించిన 6 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకొని అతడిని రిమాండ్కు తరలించారు.
కూకట్పల్లి ఏసిపి తెలిపిన వివరాల ప్రకారం… తమిళనాడుకు చెందిన జీవ గణేషన్ (26) బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇస్నాపూర్కు చేరుకున్నాడు. మేస్త్రి పనులు చేస్తుండగా… ముంబై నగరానికి చెందిన కుమార్తో పరిచయం ఏర్పడింది. మేస్త్రి పనులతో ఎక్కువ డబ్బు సంపాదించలేమని, ముంబైకి వస్తే దొంగతనాలు నేర్పిస్తానని కుమార్ చెప్పగా… అతని మాటలు నమ్మిన జీవ గణేషన్ ముంబైకి చేరుకొని దొంగతనాలకు అలవాటు పడ్డాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల నివసించే ఏరియాలను ఎంచుకొని… ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు దొంగిలిస్తూ… వాటిని ఇస్నాపూర్ సమీపంలోని తోతానం గ్రామంలో రాజేందర్ అనే వ్యక్తికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
కాగా ఈనెల 23న కెపీహెచ్బీ కాలనీ 1, 3వ ఫేజ్లలో రెండు చోట్ల ల్యాప్టాప్లను దొంగిలించి పారిపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చివరకు దొంగతనం చేసిన వ్యక్తి జీవ గణేషన్ గా తేల్చి పట్టుకున్నారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో 10 ల్యాప్టాప్స్ను దొంగిలించినట్లు తేల్చారు. అతని వద్ద కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన 4 ల్యాప్టాప్లను, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన 2 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతను మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడ 3 ల్యాప్టాప్లను దొంగతనం చేసినట్లు పోలీసులు తేల్చారు. 2.5 లక్షల విలువైన 6 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి శిక్షణ ఇచ్చిన కుమార్ చనిపోగా అతని వారసత్వాన్ని కొనసాగిస్తూ జీవ గణేష్ పలు దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని అభినందించాడు.