రంగారెడ్డి, జూలై 26 (నమస్తే తెలంగాణ) : వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతోపాటు, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ అధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై కలెక్టర్ జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల కారణంగా సంభవించే సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా, విషజ్వరాలు, మెదడువాపు వంటి వాటిని అరికట్టేందుకు వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని, వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముందుగా మున్సిపల్ పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, ఎకడైనా నీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ వేయాలని, దోమలు రాకుండా ఫాగింగ్ చేయాలని, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రతిరోజూ జ్వరాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జ్వరం కేసులు వచ్చినట్లయితే వాటిపై ఎకువ దృష్టి కేంద్రీకరించి తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రతి శుక్రవారం డ్రై డేను నిర్వహించాలి
ప్రతి శుక్రవారం అన్ని ఇండ్లు, సంస్థల్లో చేపట్టి ఫ్రైడే డ్రై డేను నిర్వహించి నీటినంతటిని బయట పారబోసి దోమలు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ తెలిపారు. డెంగ్యూ జ్వరాలు రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతను చేపట్టాలన్నారు. ఎకడైనా కేసులు వస్తే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. ఆర్బీఎస్కే బృందాలు జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, పాఠశాలలు, కేజీబీవీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలను నిరంతరం సందర్శించి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షించాలని సూచించారు.
అవగాహన కల్పించి చర్యలు చేపట్టాలి
పాఠశాలల్లో సైన్స్ టీచర్ల ద్వారా విద్యార్థులకు వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సీజనల్ వ్యాధులపై పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని విద్యా శాఖ అధికారికి కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ సెక్రటరీల ద్వారా తగు చర్యలు చేపట్టాలని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో సీజనల్ వ్యాధులను అరికట్టాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్రావు, పీడీ డీఆర్డీఏ ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, జిల్లా మత్సశాఖ అధికారి సుకీర్తి, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.