బడంగ్పేట, నవంబర్ 22: మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఐటీ కారిడార్కు కేరాఫ్గా మారబోతుంది. ఫార్మా సిటీ ఏర్పాటుతో ఆ ప్రాంతం రూపు రేఖలు మారుతున్నాయి. మెడికల్, లా, డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ అనేక కళాశాలలతో పాటు విద్య, వైద్యం, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అగ్రగామిగా ఎదిగింది. మౌలిక వసతులు, ఆహ్లాదం కోసం పార్కుల అభివృద్ధి, చెరువుల సుందరీకరణ, యోగా కేంద్రాలతో ప్రకృతి సౌందర్యాన్ని తలపిస్తోంది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ మంచినీరు సౌకర్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి బస్తీ దవాఖానలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఏర్పాటు చేశారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 52 కంపెనీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. రూ.6600 కోట్లతో శంషాబాద్ నుంచి కందుకూరు వరకు మెట్రోరైల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి పరుగులు పెట్టిస్తున్నారు.
కందుకూరులో రూ.175 కోట్లతో మెడికల్ కళాశాలను ప్రభుత్వ సహకారంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏర్పాటు చేశారు. రూ.1200 కోట్లతో కొత్తపేటలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయబోతున్నారు. మహేశ్వరంలో రూ. 6కోట్లతో ఐదు పడకలు ఉన్న ఆసుపత్రిని 50 పడకలుగా, రూ.10.7కోట్లతో జల్పల్లిలో 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 13 బస్తీ దవాఖానలు, 8 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీల్లో ప్రభుత్వ సహకారంతో మంత్రి సబితారెడ్డి రూ.833 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.312కోట్లతో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్, రూ.200 కోట్లతో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్, రూ.233 కోట్లతో జల్పల్లి మున్సిపాలిటీ, రూ.88కోట్లతో తుక్కుగూడ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు.
నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో ప్రభుత్వం అవృద్ధికి పెద్ద పీట వేసింది. సీడీపీ, డీఎంఎఫ్టీ, ఎస్డీఎఫ్ నిధులు రూ.45 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.17 కోట్లతో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణ, రూ.280 కోట్లతో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ మంచినీటి సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. రూ.99.40కోట్లతో బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు జల్పల్లి మున్సిపాలిటీలో మురుగు నీటి రూపకల్పన కార్యక్రమాలు మంత్రి చేపట్టారు. హెచ్ఎండబ్ల్యూఎస్ నిధులు రూ.330కోట్లతో పట్టణ ప్రాంతాల్లో మంచి నీటి సౌకర్యం, రూ.3కోట్లతో రావిర్యాలలో క్రీడా ప్రాంగణంను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో రూ.40 కోట్లతో 11 చెరువులను సుందరీకరణ చేపట్టారు.
రూ.83 కోట్లతో పల్లె ప్రగతి, రూ.41కోట్లతో పట్టణ ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రూ.1.50 కోట్లతో బట్టేల్ గుట్ట, రూ.1.40 కోట్లతో రాక్ గార్డెన్, రూ.60లక్షలతో మీర్పేటలో పురాతన బుర్జును తీర్చిదిద్దారు. రూ.10 కోట్లతో పురాతన దేవాలయాల అభివృద్ధి, రూ.14కోట్లతో పహాడీషరీఫ్ దర్గా రోడ్డు, రూ.450 కోట్లతో నియోజక వర్గంలో రోడ్లను అభివృద్ధి చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.160.9 కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రూ.8 కోట్లతో మోడ్రన్ దోబీఘాట్స్, రూ.16 కోట్లతో సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాల, జూనియర్ కళాశాల, బీసీ సంక్షేమ లా కళాశాల, జిల్లా గ్రంథాలయం, డైట్ కళాశాల, మైనార్టీ, ట్రైబల్ రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. మన ఊరు మన బడిలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో రూ.32కోట్లతో మౌలిక వసతుల కల్పన, రూ.8 కోట్లతో వివిధ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం పనులు చేపట్టారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల డిగ్రీ కళాశాల, బీసీ బాలుర, బాలికల కళాశాలలు, గిరిజన, మైనార్టీ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడంలో విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకున్నారు.
మహేశ్వరం ఐటీ కారిడార్గా మారబోతుంది. వేల ఎకరాల్లో కందుకూరులో ఫార్మా సిటీ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతం రూపు రేఖలు మారబోతున్నాయి. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో రూ.250 కోట్లతో విజయ డైరీ ఏర్పాటు చేశారు. ఫాక్స్ఖాన్, విప్రో, అమేజాన్, రేడియంట్, చిరిపాల్, ఓరియంట్ ఎలక్ట్రిక్,మలబార్ గోల్డ్, సకుర సోలార్ పవర్, ప్రీమియర్ ఎనర్జీస్, సాప్రాన్ ఎయిర్ క్రాప్ట్, డిఫెన్స్ వంటి అనేక కంపెనీలను ప్రభుత్వ సహకారంతో మంత్రి సబితారెడ్డి తీసుకొచ్చారు.
నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా వేలాది మందికి లబ్ధి చేకూర్చింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పింఛన్ల ద్వారా ఇప్పటివరకు 29,927 మందికి 578 కోట్ల ఆర్థికం సహాయం అందజేశారు. రైతుబంధు ద్వారా 35,222 మందికి రూ.389 కోట్లు, కల్యాణలక్ష్మి ద్వారా 11,158 మంది పేదింటి యువతులకు రూ.108 కోట్లు, షాదీముబారక్ ద్వారా 5113 మందికి రూ.51 కోట్లు అందజేశారు. గొర్రెల పంపిణీకి రూ.42.03 కోట్లు, మైనార్టీ కుటుంబాల్లోని పేదలకు రూ.1.31 కోట్లు, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 4232 మందికి 15.25 కోట్లు , చేపల పంపిణీకి రూ.5 కోట్లు ప్రభుత్వం అందజేసింది. నియోజకవర్గంలో ఆత్మగౌరవ భవనాలకు రూ.84 కోట్లు కేటాయించింది. 2029 మందికి కేసీఆర్ కిట్లు, 2 వేల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. బీసీబంధు కింద రూ.3కోట్లు, దళితబంధు కింద రూ.10 కోట్లు ఇప్పటి వరకు అందజేసింది. 6532 మంది రైతులకు 8702 మందికి ప్రభుత్వం రుణమాఫీ చేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేశా. నియోజకవర్గాన్ని విద్యా హబ్గా, ఐటీ కారిడార్గా మార్చబోతున్నాం. ఐటెక్ సిటీని తలదన్నే విధంగా మారబోతోంది. అనేక కంపెనీలు వచ్చాయి. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. అర్బన్ పార్కుల అభివృద్ధి, చెరువులు కబ్జా కాకుండా సుందరీకరణ చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నాం. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని పనులు చేస్తున్నాం. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నాం. మురుగు నీటి సమస్య, ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాం. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నాం.
– విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి