తాండూరు రూరల్, ఆగస్టు 18 : రాష్ట్రస్థాయి స్వచ్ఛ పురస్కార్ అవార్డు కోసం వికారాబాద్ జిల్లా నుంచి మల్కాపూర్ ప్రాథమిక పాఠశాల పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపనున్నట్లు సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఉదయ అన్నారు. గురువారం తాండూరు మండలం, మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని వసతులపై ఆరా తీశారు. పాఠశాల అభివృద్ధిలో ప్రభుత్వం, ఉపాధ్యాయులు, ప్రజల భాగస్వామ్యం గురించి అడిగి తెలుసున్నారు.
పాఠశాల ఆవరణలో హరితహారం కార్యాక్రమంలో నాటిన మొక్కలు, వాటి సంరక్షణను తెలుసుకున్నారు. విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, మధ్యాహ్న భోజనం నాణ్యత, శానిటేషన్ పనితీరును పరిశీలించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల భాగస్వామ్యం గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారి రవి, ఎంఈవో వెంకటయ్యగౌడ్, సర్పంచ్ విజయలక్ష్మి, హెచ్ఎం నాగప్ప, నాయకుడు పండరి ఉన్నారు.