తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అన్నదాతలను చైతన్య పరుస్తున్నది. ఫరూఖ్నగర్, కొత్తూరు, కడ్తాల్, షాబాద్, కేశంపేట, శంకర్పల్లి, చేవెళ్ల మండలాల్లో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను అధికంగా సాగు చేస్తున్నారు. సాగు పనులు మొదలుకుని పంట చేతికొచ్చాక క్వింటాల్కు రూ.1960 మద్దతు ధరను అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఎకరాకు 45 నుంచి 52 క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 10,360 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. ఈ నెలాఖరు వరకు మాత్రమే మొక్కజొన్న సాగుకు అనుకూల సమయమని పేర్కొంటున్నారు. రైతులు నేల సారాన్ని బట్టి పంటలను సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
– రంగారెడ్డి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ ఏర్పడ్డాక నీటికి కొరత లేకపోవడంతో రంగారెడ్డి జిల్లాలో వరి సాగును పెద్ద మొత్తంలో చేస్తున్నారు. వరి అనంతరం పంటల్లో మొక్కజొన్న ద్వితీయ ప్రాధాన్యం గల పంట కాగా, వేరుశనగ తృతీయ స్థానంలో కొనసాగుతున్నది. జిల్లాలో ఫరూఖ్నగర్, కొత్తూరు, కడ్తాల్, షాబాద్, కేశంపేట, శంకర్పల్లి, చేవెళ్ల మండలాల్లో ద్వితీయ ప్రాధాన్యం గల పంటగా మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. పైన పేర్కొన్న మండలాల్లో ఈ పంట విస్తీర్ణం ఏటేటా పెరుగుతున్నది. దిగుబడులు కూడా గణనీయంగా ఉన్నాయి. ఈ పంటను అన్ని సీజన్లలోనూ వరికి ప్రత్యామ్నాయ పంటగా సాగు చేస్తున్నారు.
మొక్కజొన్నల ధర కూడా మార్కెట్లో అధికంగా పలుకుతున్నది. రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ పట్టణ మార్కెట్లు సమీపంలో ఉండటం, రోడ్డు రవాణా సౌకర్యం ఉండటం, వ్యవసాయ మార్కెట్లు అందుబాటులో ఉండటంతో మొక్కజొన్న ధరకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. వ్యవసాయానికి అనుకూలమైన నల్ల రేగడి, ఎర్ర నేలలు ఉండటం ఈ ప్రాంత ప్రత్యేకత. దీంతో ఎకరా మక్క సాగులో సుమారు 45 నుంచి 52 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది.
– రంగారెడ్డి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ)
ఖరీఫ్కు సంబంధించి జిల్లాలోని ఫరూఖ్నగర్ మండలంలో 340 ఎకరాల్లో, కొత్తూరులో 319, కడ్తాల్లో 246, షాబాద్లో 230, కేశంపేటలో 178, శంకర్పల్లిలో 160, తలకొండపల్లిలో 95, చేవెళ్లలో 55 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత యాసంగి (2022-23)లో 10,360 ఎకరాలను సాగు చేయనున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ దీనిని అంచనా సాగుగా పేర్కొన్నది.
గత ఐదేండ్లలో యాసంగి సాగు
జిల్లాలో యాసంగి (2017-18)లో 5080, (2018-19)లో 2282, (2019-20)లో 2349, (2020-21)లో 2708, (2021 – 22)లో 10,305 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలోని పలు మండలాల్లో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. సాధారణ స్థాయిలో సాగవుతున్న మొక్కజొన్న సాగు గత యేడాది నుంచి అమాంతంగా వేలాది ఎకరాల్లో సాగవుతున్నది. వానకాలంలో సీజన్లోనూ మెట్ట రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. మరికొందరు రైతులు ఖరీఫ్ సీజన్ వరి కోయంగానే వెంటనే అదే పొలంలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు.
మొక్కజొన్నతో లాభాలు ఎక్కువే..
వరి పంట మాదిరిగా మొక్కజొన్న పంట సాగుకు నీటి సౌకర్యం అధికంగా ఉండాల్సిన అవసరం లేదు. పంట సాగుకు ఖర్చు తక్కువ, ఆరుతడి పంట కావడంతో లాభాలు కూడా పక్కాగా చేతికి అందుతున్నాయని స్థానిక రైతులు చెబుతున్నారు. షాద్నగర్, మహేశ్వరం, చేవెళ్ల నియోజకవర్గాల్లో రైతులు మొక్కజొన్న సాగు వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అధిక వర్షాలు, తెగుళ్లతో వాణిజ్య పంటల దిగుబడి తగ్గుతుండటం, ఖర్చులు అధికంగా అవుతుండటం లాంటి కారణాల వల్ల చాలా మంది రైతులు మొక్కజొన్న సాగువైపు మళ్లుతున్నారు.
వ్యయం తక్కువగా ఉండటంతో పాటు పంట సాగులో రైతుల పర్యవేక్షణ కూడా పెద్దగా అవసరం లేకపోవడం, దీంతో ఎక్కువ మంది రైతులు మొక్కను సాగు చేస్తున్నారు. చాలా మంది రైతులు చీడ, తెగుళ్ల వంటి బెడద ఉన్న పత్తి పంటలను తొలగించి, దాని స్థానంలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. వీటికి తోడు మొక్కజొన్న పంటకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.1960గా ఉండటం.. స్థానిక పీఏపీఎస్లలో ప్రభుత్వమే మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తుండటం వంటివి రైతులను మొక్క సాగు వైపు మళ్లిస్తున్నాయి.
పైగా దళారీల బాధ లేకుండా ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసి, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31 వరకు మాత్రమే మొక్కజొన్న సాగుకు అనుకూల సమయమని అధికారులు చెబుతున్నారు.
కొనుగోలుకు వ్యాపారుల్లో పోటీతత్వం
జిల్లాలో ఫరూఖ్నగర్, కొత్తూరు, కడ్తాల్, షాబాద్, కేశంపేట, శంకర్పల్లి, చేవెళ్ల మండలాల్లో మొక్కజొన్న పంటను తెలుగు రాష్ర్టాల్లోని కోళ్ల ఫారాలు, బీర్ల ఫ్యాక్టరీల యజమానులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ సాగు దిశగా రైతుల పయనం
– గీతారెడ్డి, రంగారెడ్డి జిల్లా వ్యవసాయాధికారి
రైతులు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న వ్యవసాయానికి భిన్నంగా పంటలు వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా పయనిస్తున్నారు. ప్రభుత్వం, జిల్లా వ్యవసాయ శాఖ సూచనల మేరకు రైతులు యాసంగిలో వరి మినహా మొక్కజొన్న, వేరుశనగ లాంటి పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. వరికి ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు.
ఆయా పంటల అవగాహన నిమిత్తం వచ్చే రైతులకు సరైన సమాచారం, సూచనలను అందించడానికి మా విభాగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.