వరిధాన్యంతోపాటు మక్కలనూ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. యాసంగిలో జిల్లావ్యాప్తంగా 6,780 ఎకరాల్లో మక్కజొన్న పంట సాగవ్వగా.. 12 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో 10 మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. మరోవైపు వరి ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేశారు. యాసంగికి సంబంధించి జిల్లాలో 90,300 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేయగా, 1.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 125 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించనున్నారు. దౌల్తాబాద్, బొంరాస్పేట మండలాల్లో సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలు షురూ కానుండగా.. వారం, పది రోజుల్లో మిగతా కేంద్రాలనూ అందుబాటులోకి తెచ్చే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
-వికారాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : మొక్కజొన్న, వరి పండించిన రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. యాసంగి సీజన్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈమేరకు ప్రతీ రైతు నుంచి మక్కలను సేకరించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంతో అన్నింటా రైతులకు అన్యాయం చేస్తూ వస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏ ఒక్క రైతుకూ నష్టం జరగకుండా మక్కలు, వరి ధాన్యాన్ని సేకరించేందుకు నిర్ణయించింది. మొక్కజొన్న పంటను సాగు చేసిన ప్రతీ రైతుకు మద్దతు ధర అందించేలా ప్రభుత్వ ఆధ్వర్యంలో 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మరో వారం, పది రోజుల్లో మక్కల కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 6780 ఎకరాల్లో మొక్కజొన్న పంటను జిల్లా రైతాంగం సాగు చేయగా, 12 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగానే కొనుగోలు కేంద్రాలు, గోనె సంచులు తదితరాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎక్కడైతే అధిక మొత్తంలో మొక్కజొన్న, వరి పంటను సాగు చేశారో సంబంధిత గ్రామాల్లోనే మక్కలు, వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మక్కల కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం
– మీనా, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో మక్కల కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో మక్కల కొనుగోలుకు పరిగి, వికారాబాద్, తాండూరు, మర్పల్లి, ధారూరు, బంట్వారం, పూడూరు, కుల్కచర్ల, వట్టిమీనపల్లి, మోత్కూర్లలో కొనుగోలు కేంద్రాలను రైతులకు వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాం. మక్కలను క్వింటాలుకు ప్రభుత్వం నిర్ణయించిన రూ.1960ల మద్దతు ధర ప్రతీ రైతుకు అందేలా చూస్తాం. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు అంతా సిద్ధం చేశారు. సోమవారం నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే దౌల్తాబాద్, బొంరాస్పేట్ మండలాల్లో వరి కోత పూర్తవడంతో మరో రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలను ధాన్యాన్ని తీసుకురానున్న దృష్ట్యా సోమవారం నుంచి సంబంధిత రెండు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. మిగతా కొనుగోలు కేంద్రాలను మే రెండో వారంలోగా ప్రారంభించి, రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ఏయే గ్రామాల్లో అధిక మొత్తంలో వరి సాగవుతుందనే వివరాలను బట్టి ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు వడ్లను క్వింటాలుకు ఏ గ్రేడ్ రకం రూ.2060, సాధారణ రకం రూ.2040లకు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించనుంది. ధాన్యం విక్రయించిన రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే రెండు, మూడు రోజుల్లోగా చెల్లింపులను జమ చేయనున్నారు. జిల్లాలో 90,300 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేయగా, 1.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 125 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 58, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 28, ఏఎంసీ ఆధ్వర్యంలో 7, ఐకేపీ ఆధ్వర్యంలో 29, ఎఫ్పీవో ఆధ్వర్యంలో 3 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించనున్నారు. అధిక మొత్తంలో సాగైన దృష్ట్యా రైతులకు ఇబ్బందులు కలుగకుండా వరి సాగు చేసిన 3-4 గ్రామాలకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఒకే రోజు రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకుండా కొనుగోలు కేంద్రం వద్ద ఐదుగురు చొప్పున రైతులుండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. రోజుకు 50 మంది రైతుల నుంచి 1000 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించేలా అధికారులు నిర్ణయించారు. ఇందుకుగాను ధాన్యాన్ని తరలించేందుకు సిద్ధం అయినట్లయితే నేరుగా రైతుల వద్దకు వెళ్లి ఏఈవోలు రైతులకు ఏ తేదీన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురావాలనేది తేదీతో కూడిన టోకెన్ అందజేశారు. మరోవైపు రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని నిల్వ చేసేందుకు జిల్లాలో 59 గోదాంలను సిద్ధంగా ఉంచారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని గోదాములకు తరలించేందుకు నాలుగు ఏజెన్సీలకు జిల్లా యంత్రాంగం అప్పగించింది. జిల్లాకు యాసంగిలో 40 లక్షల గన్నీ సంచులు అవసరమని గుర్తించిన అధికారులు ఇప్పటికే అందుబాటులో ఉంచారు.