కడ్తాల్ : రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. బుధవారం ఉదయం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని కల్వకుర్తి జడ్పీటీసీ భరత్కుమార్తో కలిసి ఎంపీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆలయ సంప్రదాయం ప్రకారం ఎంపీకి ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని అమ్మవారికి ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతంలోని అభివృద్ధికి నోచుకోలేదని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు పూర్వ వైభవం తీసుకరావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్లు వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు.
దశాబ్దాల చరిత్ర కలిగిన మైసిగండి మైసమ్మతల్లి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు. అనంతరం ఎంపీని, జడ్పీటీసీని ఆలయ నిర్వాహకులు శాలువ, పూలమాలతో సన్మానించారు. అంతకుముందు జిల్లా ఫారెస్ట్ అధికారి జానకిరాములు కుటుంబ సభ్యులతో మైసమ్మ అమ్మవారిని దర్శించుకోని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ, అర్చక సిబ్బంది యాదగిరిస్వామి, చంద్రయ్య, దేవేందర్, బోడియనాయక్, వెంకటేశ్, రామకృష్ణ, మహేశ్, శ్రీనివాస్, విజయ్, రాజేశ్ పాల్గొన్నారు.