కొడంగల్, నవంబర్ 17 : కార్మిక సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేసి ఎన్నో సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలో నియోజకవర్గ పరిధిలోని తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో వాహనాలకు ట్యాక్స్లు రద్దు, రూ.5లక్షల ప్రమాద బీమా అందించిన ఏకైక ప్రభుత్వంగా పేర్కొన్నారు.
పోలీసులతో ఇబ్బంది లేకుండా చేయడంతో ఆటో డ్రైవర్లు ప్రశాంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఎవరెన్ని చెప్పినా మళ్లీ రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా చరిత్రను సృష్టించడం ఖాయంగా పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న రోజువారీ ప్రచారంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్రెడ్డిని, బీఆర్ఎస్ నాయకులను ఆత్మీయంగా పలుకరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఒరిగేదేమీ లేదని, జిల్లాలోని ప్రతి నాయకుడు సీఎంగా చెప్పుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు. అభివృద్ధి చేశామని కాంగ్రెస్ నాయకులకు చెప్పుకునే దమ్ము, ధైర్యంలేక సీఎం అయితే అభివృద్ధి చేస్తామని చెప్పుకోవడం చాలా సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు సీఎం అన్నది వారిలో వారికే క్లారిటీ లేదన్నారు. సీట్ల కోసం వారిలో వారే తన్నుకుంటున్నారని, అటువంటివారు ప్రజా సంక్షేమానికి ఏవిధంగా కృషి చేస్తారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ మనుగడ కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యపడుతుందని, గత తొమ్మిదన్నరేండ్ల పాలనను చూస్తే అర్థం చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. గతంలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించి ఎటువంటి అభివృద్ధి చేసిందో గమనించాలని పేర్కొన్నారు. ప్రజల్లో ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ నాయకులు జిమ్మిక్కులకు పాల్పడితే.. నష్టమే జరుగుతుంది కానీ ఎటువంటి మేలు జరగదన్నారు. కాబట్టి ప్రజలు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించి ఇంత వరకు ఎవరి ద్వారా అభివృద్ధి సాధ్యపడింది.. ప్రజా సంక్షేమానికి ఎవరు పాటుపడ్డారు.. కష్టం వస్తే అందుబాటులో ఉండి ఎవరు ఆదుకున్నారనే అంశాలను గుర్తించి ఓటు వేయాలని కోరారు.
30వ తేదీన వేసే ఓటు అభివృద్ధికి నాంది పలకాలని, ఎటువంటి తప్పు చేసినా అభివృద్ధి, సంక్షేమం కుంటుపడే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ యూనియన్ బీఆర్ఎస్కు మా పూర్తి మద్దతు ఉంటుందని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య, జిల్లా అధ్యక్షుడు రాజేందర్సింగ్, కొడంగల్ నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ రాజశేఖర్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.