యాచారం, ఆగస్టు 13 : నాగార్జునసాగర్-హైదరాబాద్ రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. మండలంలోని గున్గల్ నుంచి మాల్ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించనున్న ది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే మండల పరిధిలోని సాగర్ రహదారిని ఆర్అండ్బీ అధికారులు సర్వే చేశారు. నాలుగులైన్ల రోడ్డుకోసం హద్దులను గుర్తించా రు. ఎమ్మెల్యే కిషన్రెడ్డి చొరవతో ఇబ్రహీంపట్నం పరిధిలోని ఖానాపూర్ నుంచి మండలంలోని తమ్మలోనిగూడ గేటు వరకు సాగర్ రహదారిని నాలుగులేన్ల రోడ్డును విస్తరించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్డు విస్తరణపై అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలకు చెక్!
హైదరాబాద్- సాగర్ రహదారి నిత్యం వందలాది వాహనాలతో ఎంతో రద్దీగా ఉంటున్నది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు అనేక వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ముఖ్యంగా మాచర్ల, వినుకొండ, గిద్దలూరు, గుంటూరు, నెల్లూరు, పిడుగురాళ్ల, తిరుపతికి చెందిన ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు ప్రతి రోజూ రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ముఖ్యంగా మంచాల మండలం ఆగపల్లి నుం చి మండలంలోని మాల్ వరకు సాగర్ రహదారిపై వాహనాల రాకపోకలు రోడ్డు వెడల్పు లేకపోవడంతో ఇబ్బంది కరంగా ఉంది. మండలంలోని గున్గల్గేటు, చౌదర్పల్లిగేటు, తక్కళ్లపల్లిగేటు, తమ్మలోనిగూడ గేటు, మండల పరిషత్ కార్యాలయం రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా నిలిచాయి. ఈ ప్రాంతాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతు న్నాయి. ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోగా, మరెంతో మంది దివ్యాంగులుగా మారారు. వాహనాల రాకపోకలు పెరుగడం, తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో రోడ్డును నాలుగులేన్ల రోడ్డుగా విస్తరించాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి సంకల్పించారు. ఆర్అండ్బీ అధికారులతో చర్చించి రోడ్డును విస్తరింప చేయాలని ఆదేశించారు. ఆర్అండ్బీ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే చేపట్టారు. సాగర్ రహదారి నాలుగులేన్ల రోడ్డుగా విస్తరిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు తగ్గనున్నాయి. వాహనదారులకు సైతం ఇబ్బందులు తప్పనున్నాయి.
ఆర్అండ్బీ అధికారుల సర్వే
సాగర్ రహదారిని నాలుగులేన్ల రోడ్డుగా విస్తరించాలన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సూచన మేరకు ఆర్అండ్బీ అధికారులు రోడ్డును సర్వే చేశారు. ఆర్అండ్బీ డీఈ వేణుగోపాల్రెడ్డి, ఏఈ శ్రీహరి రోడ్డు వెడల్పులో భాగంగా తక్కళ్లపల్లిగేటు వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న కృష్ణా పైపులైన్లను పరిశీలించారు. రోడ్డు పక్కల ఉన్న మెయిన్ వాల్వ్ను పరిశీలించారు. వాగుపై ఉన్న బ్రిడ్జిని సైతం పరిశీలించారు. రోడ్డు వెడల్పునకు అవి ఆటంకంగా మారడంతో అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాల్లో ప్రణాళికలు రచిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖానాపూర్ నుంచి తమ్మలోనిగూడ గేటు వరకు ఎన్ని మూలమలుపులు ఉన్నాయి, ఎన్ని కృష్ణా వాటర్ ఎయిర్వాల్వ్లు ఉన్నాయి, ఎన్ని కల్వర్టులున్నాయి, ఎన్ని బ్రిడ్జిలున్నాయని ఆరా తీశారు. సర్వే రిపోర్టును ఇంజినీర్లకు అందజేసి వారి సలహాల మేరకు సాగర్రోడ్డు విస్తరణ పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రయాణికుల కష్టాలు దూరం
రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం నాగార్జున సాగర్-హైదరాబాద్ రోడ్డును నాలుగులేన్ల రోడ్డుగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికే ఆర్అండ్బీ అధికారులు సర్వే చేశారు. వారి సర్వే ఆధారంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు రోడ్డును వెడల్పు చేస్తాం. త్వరలోనే ప్రభుత్వ సహకారంతో రోడ్డును విస్తరిస్తాం. సాగర్ రోడ్డు నాలుగులేన్లుగా మారనుండటంతో ప్రయాణికుల కష్టాలు తీరుతాయి.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం