కడ్తాల్, మార్చి 9: మండల కేంద్రంతోపాటు మైసిగండి, ఏక్వాయిపల్లి, చల్లంపల్లి, రావిచేడ్ గ్రామాల్లోని శివాలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా ఆలయాల్లో భజన మండలి వారిచే భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శివాలయాల్లో రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అదే విధంగా ఏక్వాయిపల్లి గ్రామంలోని మల్లన్నగుట్టపై స్వామి వారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
మండల కేంద్రంలోని శివాలయంలో విజయమ్మ-సర్వేశ్వర్, జ్యోతి-రమేశ్, అమరావతి-అంజయ్య దంపతులు పార్వతీపరమేశ్వరుల కల్యాణాన్ని నిర్వహించగా, పుస్తె మెట్టెలను కృష్ణమూర్తి అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి విరాళాలు అందజేసిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి, ఆలయ ఈవో స్నేహలత, ట్రస్టీ శిరోలీపంతూనాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, వీరశైవ లింగాయత్-లింగబలిజ సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్, నాయకులు లింగప్ప, సర్వేశ్వర్, భాస్కర్రెడ్డి, శ్రీను, శరణుబసప్ప, రమేశ్అయ్యగారు, నేతి మల్లేశ్, ఈశ్వరప్ప, మల్లికార్జున్, ప్రభులింగం, వెంకటేశ్, సాంబయ్య, భాస్కర్నాయక్, అరుణ్కుమార్, రాఘవేందర్, రాజు, వినోద్, శేఖర్, రవి, శివశంకర్, మహేశ్, శ్రీనివాస్గుప్తా, అర్చకులు వెంకటేశ్వరశర్మ, రామశర్మ, కృష్ణమూర్తి, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
మంచాల : మండలంలోని ఆరుట్ల, తాళ్లపల్లిగూడతోపాటు పలు గ్రా మాల్లోని శివాలయాల్లో శుక్రవారం రాత్రి శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణం అనంతరం ఆది దంపతులకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తాళ్లపల్లిగూడ గ్రామంలో వీఆర్వన్ ఫౌం డేషన్ సభ్యులు రూ.10 లక్షలతో ఏర్పాటు చేయించిన రథోత్సవాన్ని ఆలయ కమిటీకి అప్పగించారు. ఆ రథోత్సవంలో శివపార్వతుల విగ్రహాలను ఉంచి గ్రామంలో ఊరేగించగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీలోని పలు శివాలయాల్లో శుక్రవారం అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. పెద్దఅంబర్పేటలోని ఉమాచంద్రమౌళేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా జరిపారు. తట్టిఅన్నారంలోని శ్రీలలితాభువనేశ్వరి సమేత చంద్రమౌళీశ్వరస్వా మి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణాన్ని కనుల పండువగా అర్చకులు జరిపించారు. అంతకుముందు ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగించారు. శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.