సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరం జరిగిందా.. వెంటనే 1930కు కాల్ చేయండి.. ఈ కాల్ సెంటర్ 24/7 అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్నేరాలు జరుగుతున్నాయి. బాధితులు కొందరు సైబర్క్రైమ్ కాల్సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేసి సమాచారం ఇస్తున్నారు. ఫోన్ చేస్తున్న వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది వరకు ఉందని, అందులో 250 కాల్స్ వరకు కొత్త ఫిర్యాదులు ఉంటున్నాయి. మిగతా కాల్స్.. గతంలో ఫిర్యాదు చేసిన వారి నుంచి కేసుల పురోగతి సమాచారం కోసం వస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా.. సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు డయల్ 100కు కాల్ చేసినా.. ఆ కాల్ నేరుగా సైబర్ క్రైమ్ కాల్ సెంటర్కు వచ్చే విధంగా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు.
సైబర్ నేరాల అడ్డుకట్టకు..
సైబర్ నేరాలను అడ్డుకోవడంలో భాగంగా కేంద్రం 1930 టోల్ ఫ్రీ నంబర్తో కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఈ కాల్ సెంటర్ను హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్సీఎస్బీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. అత్యాధునిక టెక్నాలజీ కలిగి, 30 మంది సిబ్బందితో 24/7 ఈ కాల్సెంటర్ పనిచేస్తుంది. ఈ సెంటర్కు వచ్చే కాల్స్ను మేనేజ్ చేసేందుకు ఎక్సోటెల్ అనే సాఫ్ట్వేర్ను పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా టోల్ఫ్రీ నంబర్కు వచ్చే కాల్స్ను నేరుగా అక్కడ పనిచేసే సిబ్బందికి పంపిస్తుంది. ప్రతి రెండు నిమిషాలకు ఒక కాల్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో బాధితులు 5 నుంచి 10 నిమిషాలు కూడా మాట్లాడుతుంటారు. ఇలాంటి సమయంలో వచ్చే కొత్త కాల్స్.. సాఫ్ట్వేర్ సహాయంతో ఖాళీగా ఉన్న సిబ్బందికి వెళ్తుంటాయి.
బ్యాంకుల రిస్క్మేనేజ్మెంట్ టీమ్లతో..
ఈ కాల్ సెంటర్కు ఆయా బ్యాంకుల రిస్క్మేనేజ్మెంట్ టీమ్లు అనుసంధానమై ఉంటాయి. ఆయా బ్యాంకులు సైబర్నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, తమ వైపు నుంచి తక్షణ చర్యలు తీసుకునేందుకు రిస్క్మేనేజ్మెంట్ టీమ్స్ను అందుబాటులో ఉంచాయి. దీంతో కాల్సెంటర్ నుంచి సమాచారం వెళ్లగానే.. ఆయా బ్యాంక్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్స్ అప్రమత్తమై బ్యాంకు ఖాతాల ఆధారంగా డబ్బు ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని గుర్తించి, ఆ ఖాతాలను ప్రీజ్ చేస్తారు. నేరగాళ్లు ఆ ఖాతాల్లో నుంచి డబ్బు డ్రా చేయకుండా ఉంటే.. అందులో ఉండే నగదు కూడా ఫ్రీజ్ అవుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
అప్రమత్తతే శ్రీరామరక్ష
సైబర్నేరగాళ్లు ఏదో ఆశ చూపి వల వేస్తుంటారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్లో మాట్లాడి.. ఏదైనా స్కీమ్ గురించి చెబితే వివరాలు తెలుసుకోవడం క్షేమమన్నారు. కనీసం తెలిసిన వ్యక్తులతోనైనా చర్చించాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో గూగుల్లో సెర్చ్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. సైబర్నేరగాళ్ల చేతిలో పడి మోసపోతే.. వెంటనే సైబర్క్రైమ్ టోల్ప్రీ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.