ముంబై, జూలై 14: ఇటీవల ఐపీవో జారీచేసిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎట్టకేలకు తాజా ఎంబడెడ్ విలువను ప్రకటించింది. ఈ ఏడాది మార్చి చివరినాటికి ఈ విలువ రూ.5,41,492 కోట్లు ఉందని గురువారం ఎల్ఐసీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఏడాది క్రితం ఈ విలువ రూ.95,605 కోట్లుకాగా, 2021 సెప్టెంబర్ చివరినాటికి ఇది రూ.5,39,686 కోట్లు అని ఐపీవోకు వచ్చే ముందు సంస్థ వెల్లడించింది. జీవిత బీమా వ్యాపారాల్లో షేర్హోల్డర్ల విలువను లెక్కించేదానిని ఎంబడెడ్ విలువగా పరిగణిస్తారు.
2021-22లో జరిగిన ఎల్ఐసీ చట్ట సవరణల ఫలితంగా షేర్హోల్డర్లకు, పాలసీ హోల్డర్లకు మధ్య జరిపిన నిధుల విభజనతో 2021 మార్చికంటే 2021 సెప్టెంబర్లో ఎంబడెడ్ విలువ బాగా పెరిగిందని సంస్థ వివరించింది. 2022 మార్చితో ముగిసిన ఏడాదిలో వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ (వీఎన్బీ) రూ.7,619 కోట్లుగా ఉందని ఎల్ఐసీ తెలిపింది. నిరుడు ఇది రూ.4,167 కోట్లు. విలువను గణించడంలో జాప్యం కారణంగా మార్చి ఎంబడెడ్ విలువను వెల్లడించే గడువు తేదీని గతంలో ఎల్ఐసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.