న్యూఢిల్లీ, జూలై 31: పసిఫిక్ మహాసముంద్రంపై ఒక మోస్తరు ఎల్ నినో కొనసాగుతున్నందున నైరుతి రుతుపవనాలు బలహీనపడవచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. ఆగస్టులో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది. శుక్రవారం తన తాజా నెలవారీ, కాలానుగుణ అంచనాలను ఐఎండీ విడుదల చేస్తూ ఆగస్టులో దేశంలో సగటు వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)లో 94 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. 1971-2020 మధ్యకాలపు వాతావరణ గణాంకాల ఆధారంగా ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం 254.9 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఏరుతుపవన పీడనాల కారణంగా జూలైలో దేశంలో దాదాపు సాధారణ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ అంచనా వెలువడింది. ఆగస్టులో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాయవ్య, ఈశాన్య, తూర్పు-మధ్య భారతదేశంలో సాధారణ లేదా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.