బొంరాస్పేట, మార్చి 7 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సమాజంలో అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు విద్యాశాఖ కృషి చేస్తున్నది. కేవలం ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వినడం, నోట్స్ రాయడమే కాకుండా ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల్లో పఠనా నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నది. ఇప్పటికే చతుర్విద ప్రక్రియలైన వినడం, చదవడం, మాట్లాడటం, రాయడంలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా విద్యార్థుల్లో పఠనా నైపుణ్యం పెంపొందించడానికి విద్యాశాఖ కార్యాచరణను రూపొందించింది.
ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత తరగతుల వరకు పాఠశాలల్లో ప్రత్యేకంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పీరియడ్ను కేటాయించాలని ఉపాధ్యాయులను ఆదేశించింది. ఏర్పాటు చేసిన గ్రంథాలయాలకు నేషనల్ బుక్ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి వివిధ రకాల పుస్తకాలను విద్యాశాఖ తాజాగా పాఠశాలలకు సరఫరా చేసింది. వికారాబాద్ జిల్లాలోని 461 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు , 66 ఉన్నత పాఠశాలలకు పలు రకాల కథల పుస్తకాలను సరఫరా చేసింది.
ఉన్నత పాఠశాలకు 120 చొప్పున, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 261 చొప్పున కథల పుస్తకాలను అందజేసింది. వీటితో పాటు ఏడు పోస్టర్లు, 10 బిగ్ స్టోరీ బుక్స్లను కూడా అధికారులు అందజేశారు. పాఠశాలల్లో గ్రంథాలయానికి ప్రత్యేకంగా గది లేకపోతే బుక్ కార్నర్లను ఏర్పాటు చేసి విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పించాలని సూచించారు. ప్రతి పీరియడ్లో 15 నిమిషాలు పఠనం కోసం కేటాయించాలని, ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేకంగా పఠనానికి ఒక పీరియడ్ కేటాయించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించేలా గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. పుస్తకం, పదాల ఎంపిక, విషయావగాహన చేసుకోవడం, విషయ వ్యక్తీకరణను చేయడం గ్రంథాలయాల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. ఎంచుకున్న పుస్తకాన్ని విద్యార్థి బిగ్గరగా చదువుకోవడం, ఇతరులతో కలిసి సహా పఠనం చేయడం, జత పఠనం, స్వతంత్ర పఠనం ప్రక్రియల్లో పుస్తకంలోని విషయాలను అవగాహన చేసుకునే విధంగా విద్యార్థులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచడానికి గ్రంథాలయాలను ఏర్పాటు చేసి చాలా రకాల కథల పుస్తకాలను పాఠశాలలకు సరఫరా చేస్తున్నాం. వారానికి ఒక పీరియడ్ను రీడింగ్ కోసం కేటాయించాలని ఆదేశించాం. విద్యార్థులకు నచ్చిన పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లి చదివి మళ్లీ తెచ్చి ఇవ్వాలి. గతంలో పాఠశాలల్లో రీడింగ్ కార్నర్లను కూడా ఏర్పాటు చేశాం. పాఠశాలల్లో రీడింగ్ కార్నర్లు, గ్రంథాలయాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తున్నాం. దీనివల్ల విద్యార్థులు భాషపై పట్టు పెంచుకుంటారు.
-రేణుకాదేవి, డీఈవో వికారాబాద్