న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: కేజీ-డీ6 బ్లాక్లోని శాటిలైట్ క్లస్టర్ గ్యాస్ క్షేత్రం నుంచి ఉత్పత్తిని ప్రారంభించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), బ్రిటీష్ పెట్రోలియం (బీపీ) సోమవారం ప్రకటించాయి. కేజీ-డీ6 బ్లాక్లో ఆర్-క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్, ఎంజే అనే మూడు డీప్-వాటర్ గ్యాస్ క్షేత్రాలను ఉత్పత్తికి అనుగుణంగా ఆర్ఐఎల్, బీపీ సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి. వీటిలో గతేడాది డిసెంబర్లో ఆర్-క్లస్టర్ నుంచి ఇరు సంస్థలు ఉత్పత్తిని మొదలు పెట్టాయి. ఇప్పుడు శాటిలైట్ క్లస్టర్నూ ఉత్పత్తిలోకి తీసుకొచ్చాయి. కాకినాడ వద్దనున్న ప్రస్తుత ఆన్షోర్ టెర్మినల్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ క్లస్టర్ ఉన్నది. ఇక వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఎంజే క్లస్టర్ ఉత్పత్తిలోకి రాగలదన్న ఆశాభావాన్ని ఆర్ఐఎల్, బీపీ వ్యక్తం చేశాయి. కాగా, 2023 నాటికి ఈ మూడు క్షేత్రాల్లో రోజుకు దాదాపు 30 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ సహజ వాయువు ఉత్పత్తి కాగలదని రిలయన్స్, బీపీ అంచనా వేస్తున్నాయి. దీనివల్ల దేశీయ గ్యాస్ డిమాండ్లో 15 శాతం అవసరాలు తీరగలవని భావిస్తున్నారు. కేజీ-డీ6లో ఆర్ఐఎల్కు 66.67 శాతం వాటా, బీపీకి 33.33 శాతం వాటా ఉన్నది.