రంగారెడ్డి, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) ; ఆది నుంచీ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల వివక్షత చూపుతూ వస్తున్నదని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఇష్టం వచ్చినట్లుగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతుండడం పట్ల బీసీ నేతలు మండిపడుతున్నారు. బీసీలకు న్యాయం చేయకపోగా.. దమ్ముంటే బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని రెచ్చగొట్టేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడడం సమంజసం కాదని నేతలు పేర్కొంటున్నారు. ఇకనైనా బీసీలు మేల్కొనాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా పలువురు నేతలు గుర్తు చేస్తున్నారు. ఈసారి గెలిపించుకోకుంటే.. రానున్న రోజుల్లో ఏ ఎన్నికల్లోనూ బీసీలకు టికెట్ ఇచ్చేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదని హెచ్చరిస్తున్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతిని కాంక్షించి బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్కు తమ మద్దతు అని పలువురు నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇదే స్ఫూర్తితో పార్టీలకతీతంగా అన్ని కుల సంఘాలు ఏకతాటిపైకి వచ్చి కాసానిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిస్తున్నారు. బీసీలు తల్చుకుంటే ఏదైనా సాధిస్తారని ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా నిరూపించాలన్నారు.
బీసీల దమ్మేంటో చూపిస్తాం
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. బడుగులను చులకనగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. బీసీల ఐక్యతను చాటుతాం. జనాభాలో మెజార్టీగా ఉన్న బీసీల సత్తా చూపెడతాం.
– నర్సింహులు, పర్వతాపూర్, తాండూరు
కాసాని గెలుపే ధ్యేయం
చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని ముదిరాజ్ బిడ్డ కాసానికి కేటాయించడం హర్షణీయం. గతంలో ఎంపీగా గెలిచిన వ్యక్తి ఆస్తులను కాపాడుకునేందుకు కాంగ్రెస్లోకి జంప్ అయ్యాడు. కానీ కాసాని కేవలం బీసీల ఐక్యత కోసం తన జీవితాంతం పోరాటం చేస్తూనే ఉన్నారు. బీసీ బిడ్డ కాసానిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం.
– శివరామ్, జినుగుర్తి, తాండూరు
బీసీలంతా ఒక్కటవుతారు
బీసీలంగా ఏకతాటి పైకి వచ్చి కాసానిని అధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొన్ని రోజులకే ఆ పార్టీ నేతలు ఆహంకార ధోరణితో విర్రవీగుతున్నారు. బీసీలకు బీఆర్ఎస్ అధినేత పెద్దపీట వేశారు. జనాభా లెక్కన చూసిన కూడా బీసీలమే అధిక శాతం ఉన్నాం. తప్పకుండా జ్ఞానేశ్వర్ను గెలిపించుకుంటాం.
– బీర్బల్, మైతాబ్ఖాన్గూడ, నవాబుపేట మండలం
బీసీల గళం వినిపించాలి
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతోకాలంగా కృషిచేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్కే మా మద్దతు. బీసీల గళం వినిపించాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్ నాయకులు ఊసరవెల్లిలా రంగులు మారుస్తారే తప్ప న్యాయం చేయరు. బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసి సరైన న్యాయం చేసింది. కాసానిని గెలిపించుకుందాం.
– రాఘవేందర్ ముదిరాజ్, పులుమామిడి, నవాబుపేట మండలం
బీసీ కులాల ఐక్యత చాటుతాం
ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ గెలుపునకు కృషిచేస్తాం. ఉమ్మడి రాష్ట్రంలోనే జ్ఞానేశ్వర్ బీసీ కులాలను ఏకం చేసి రాజకీయ చైతన్యం కల్పించారు. బీఆర్ఎస్ అగ్ర కులాల నాయకులకు టికెట్ ఇవ్వకుండా ఓ బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉన్నది. కాసానిని అధిక మెజార్టీతో గెలిపించి బీసీ కులాల ఐక్యత చాటుతాం.
– ఎం.రాములు, పూడూరు మండలం
కాసానికి టికెట్ ఇవ్వడం అభినందనీయం
కాసాని గతంలో ఉమ్మడి జిల్లా అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచారు. అలాంటివారు పార్లమెంట్లోకి వెళ్తే నిరుపేదల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. బీసీ నాయకుడికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం అభినందనీయం. అధికారం కోసం పార్టీలు మారినవారికి సరైన బుద్ధి చెప్పాలి. – హన్మంత్, కడ్మూర్, పూడూరు మండలం
మన ఓట్లు మన నాయకుడికే వేసుకుందాం
ఎన్నికల్లో కాసాని గెలుపొందడం ఖాయం. గతంలో చేవెళ్ల నుంచి ఇద్దరు నాయకులు ఎంపీగా గెలుపొంది తమ సొంత ప్రయోజనాల కోసం ఇతర పార్టీలోకి వెళ్లారు. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి మన ఓట్లు మన నాయకుడికే వేసుకుందాం. ఎంపీగా జ్ఞానేశ్వర్ గెలుపొందితేనే పార్లమెంట్లో బీసీల సమస్యలపై పోరాటం చేస్తారు.
– కుమ్మరి దర్శన్, బీసీ సెల్ నాయకుడు, షాబాద్ మండలం
బీసీలను ఏకం చేసిన నాయకుడు కాసాని
రాష్ట్రంలో 96 కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి సమస్యలపై పోరాటం చేసిన ఘనత కాసాని జ్ఞానేశ్వర్కే దక్కుతుంది. అలాంటి నాయకుడిని గుర్తించిన కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం గొప్ప పరిణామం. బీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే కాసాని ఎంపీగా గెలవాల్సిందే. మన సత్తా చాటాల్సిందే.
– కారు చెన్నయ్య, బోడంపహాడ్, షాబాద్ మండలం
జ్ఞానేశ్వర్ విజయానికి కృషి చేస్తాం
పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ నాయకుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ విజయానికి కృషి చేస్తాం. బీసీలకు దమ్ము, ధైర్యం ఉంటే కాసానిని గెలిపించుకోండి చూస్తాం అంటూ ఓ నాయకుడు సోషల్ మీడియాలో సవాల్ చేశాడు. ఈ విషయాన్ని బీసీలందరూ గమనించి బీసీ నేత కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకుని మన సత్తా చాటుదాం.
– ఎడ్ల ఉదయ్, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు, కందుకూరు