రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అమల్లోకి తీసుకురావడంతో అతివలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన ఈ పథకాన్ని శనివారం మధ్యాహ్నం సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల నుంచి అందుబాటులోకి వచ్చింది. ఆర్డినరీ, పల్లెవెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా వయసుతో సంబంధం లేకుండా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఎక్కడికైనా వెళ్లి రావొచ్చు.
కాగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు భారతిహోలీకేరి, నారాయణరెడ్డిలు మహాలక్ష్మి పథకం పోస్టర్లను ఆవిష్కరించి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వారు బస్సుల్లో ప్రయాణించి మహిళలకు ఉచిత ప్రయాణ టికెట్లను అందజేశారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో ఈ ఉచిత ప్రయాణ సేవలు ప్రారంభమయ్యాయి. బస్సు ఎక్కగానే మహిళలకు జీరో టికెట్ను జారీ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో ప్రతిరోజూ 45 వేల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
-షాబాద్, డిసెంబర్ 9
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని శనివారం నుంచి అమల్లోకి తెచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ప్రారంభించడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉమ్మడి జిల్లాలో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. అందుకనుగుణంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సు డిపోల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని ఇప్పటికే ఆయా డిపో మేనేజర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహిళా ప్రయాణికులు తమకు సంబంధించిన ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ కార్డు తదితర గుర్తింపు కార్డులను కండక్టర్కు చూపించి ఉచితంగా ప్రయాణించారు. వారికి కండక్టర్లు జీరో టికెట్లను జారీ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళలు హర్షం వ్యక్తంచేశారు.
వికారాబాద్, డిసెంబర్ 9 : ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునేలా జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీగా పని చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. శనివారం వికారాబాద్ ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం), చేయూత (రాజీవ్ ఆరోగ్యశ్రీ ) పథకాలను కలెక్టర్ వైద్య ఆరోగ్య, రవాణా శాఖ అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి (ఉచిత టికెట్) పథకాల గోడ ప్రతులను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్జెండర్లు వయసుతో సంబంధం లేకుండా రాష్ట్ర పరిధిలో ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని కలెక్టర్ పేర్కొన్నారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, పట్టణ ప్రాంతాల్లో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కూడా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. మహిళా సాధికారతకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పేదలందరికీ ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు చేయూత పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు వైద్య ఆరోగ్య సహాయం ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆరోగ్య తెలంగాణ దిశగా అన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ ఆసుపత్రిలో తక్షణమే అమలు చేస్తారని వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మేమున్నాం అనే భరోసా ద్వారా ఆరోగ్యశ్రీ కింద 1,672 రోగాలకు వైద్య సహాయం అందజేస్తున్న దృష్ట్యా, ప్రజల్లో ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆస్తులను అమ్ముకోకుండా బాధ్యత తీసుకోవలసిన అవసరం మనందరిపై ఉందని కలెక్టర్ గుర్తు చేశారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పల్వన్ కుమార్, డీసీహెచ్ఎస్ ప్రదీప్కుమార్, సీడీఆర్ఎంవో సుధాకర్ షిండే, జీసీహెచ్ సూపరింటెండెంట్ రామచంద్రయ్య, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్చార్జి వీరేశం, ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ రాజు, డిపో మేనేజర్ బాక్షినాయక్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి, మహిళా సంఘం నాయకురాలు రత్నమ్మతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు, ప్రయాణికులతో పాటు కలెక్టర్, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడి వరకు బస్సులో ప్రయాణం చేశారు.
వికారాబాద్ జిల్లాలో మూడు ఆర్టీసీ డిపోలుండగా వీటిలో 226 బస్సులు ఉన్నాయి. తాండూరులో 86.. 24 ఎక్స్ప్రెస్లు, ఐదు డీలక్స్ బస్సులు, 57 ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులున్నాయి. ప్రతిరోజూ 23 రూట్లలో 33 వేల కిలోమీటర్ల దూరం బస్సులు తిరుగుతాయి. నిత్యం బస్సుల్లో 30 వేల మంది ప్రయాణిస్తుంటారు. వికారాబాద్ డిపోలో 65.. ఒక ఎక్స్ప్రెస్, మిగతా 64 ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులున్నాయి. ప్రతిరోజూ 20 రూట్లలో 24 వేల కిలోమీటర్ల దూరం బస్సులు తిరుగుతాయి.
రోజూ సగటున 26 వేల మంది ప్రయాణిస్తుంటారు. పరిగిలో 75.. 26 ఎక్స్ప్రెస్లు, 49 ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులున్నాయి. ప్రతిరోజూ 22 రూట్లలో 30 వేల కిలోమీటర్ల దూరం తిరుగుతుంటాయి. నిత్యం బస్సుల్లో సగటున 30 వేల మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల్లో 55 శాతం మహిళలే ఉంటారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ లెక్కన ప్రతిరోజూ జిల్లాలో సుమారు 45 వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడంతో ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో వేల మంది ఆటోలు నడుపుకొంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కలగడంతో ఆటోల్లో ఎవరూ ఎక్కరని, ఇది తమ జీవనోపాధికి గండి కొడుతుందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.