బొంరాస్పేట, నవంబర్ 14: భారతదేశం భిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో మతాలు, కులాలు, జాతులు ఉన్న మన దేశంలో ఒక్కో మతానికి, కులానికి, జాతులకు ప్రత్యేకించి పండుగలు కూడా ఉన్నాయి. కొన్ని పండుగలు యావత్ దేశం అం తటా జరుపుకొని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నా యి. మరికొన్ని పండుగలను వారి వారి ప్రాంతాలు, జా తులను బట్టి నిర్వహించుకుంటారు. తెలంగాణలో అత్యధికంగా నివసించే గిరిజన తెగకు చెందిన లంబాడీలు జరుపుకొనే దసరావ్ పండుగలు వారి సంస్కృతీసంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.
లంబాడీల ఆరాధ్య దైవమైన తుల్జాభవానీ మాత ను కొలుస్తూ ప్రతి రెండేండ్లకోసారి దసరావ్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకొంటారు. ఈ ఆచారం కొన్నేం డ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్నది. ప్రతి ఏటా కార్తిక పౌర్ణ మి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నుంచి 45 రోజులపాటు నవంబర్, డిసెంబర్ నెలల్లో లంబాడీలు ఘ నంగా నిర్వహించుకుంటారు. పట్టణ నాగరికతకు దూరంగా ఉంటూ ఏడాది పొడవునా కాయకష్టం చేసుకుని బతికే లంబాడీలకు దసరావ్ పండుగ వచ్చిందంటే ప్రతి ఇంటా సంబురమే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సంబురాల్లో మునిగి తేలుతారు. వానకాలం పంటలు చేతికొచ్చే వేళ గిరిజనులు జరుపుకొనే దసరావ్ పండుగపై ప్రత్యేక కథనం.
ఇండ్ల అలంకరణ..
వికారాబాద్ జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా బొంరాస్పేట, కులకచర్ల మండలాల్లో తండా ల సంఖ్య అధికం. 45 రోజులపాటు ఈ తండాల్లోని ఏ ఇంటిపైన చూసినా ఎర్ర జెండాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరణ పూర్తి చేసుకున్న ఇండ్లే కనిపిస్తాయి. ప్రతి రెండేండ్లకోసారి లంబాడీలు తమ కుల దైవమైన తుల్జాభవానీ మాతకు పూజలు చేస్తూ దసరావ్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకొంటారు.
పండుగ జరుపుకొనే విధానం
ప్రతి ఏటా కార్త్తిక పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నుంచి పండుగ ప్రారంభమవుతుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో దసరావ్ పండుగను జరుపుకొంటారు. ఒక తండాలో ఉన్న అన్ని కుటుంబాల వారు ఒకే రోజు పండుగను జరుపుకోవడం వారి ప్రత్యేకత. మొదట తమ ఇండ్లకు సు న్నం, రంగులు వేసి శుభ్రం చేసుకుంటారు. కొందరు దసరావ్ పండుగకు ముందు పీర్లకు కందుర్లు కూడా చేస్తారు. ఆ తర్వాత తండాలోని ప్రతి కుటుంబం నుంచి ఒకరు లేక ఇద్దరు కలిసి ఇంట్లో వెండితో తయారు చేసిన తుల్జాభవానీమాత విగ్రహాన్ని తీసుకుని మహారాష్ట్రలోని తుల్జాపూర్కు వెళ్తారు. అక్కడ అమ్మవారి ఆలయంలో మేకపోతులను బలిచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అక్కడి పూజారులు లంబాడీల మెడ లో గవ్వలదండ వేసి ఎర్రటి వస్ర్తాన్ని కప్పుతారు. వాటిని తీసుకుని లంబాడీలు చేతిలో కమలం రంగు జెండాపట్టుకుని బయలుదేరి తండాకు చేరుకుంటారు.
దసరావ్ పండుగను మంగళవారం మాత్రమే చేస్తారు కాబట్టి శనివారం తుల్జాపూర్కు వెళ్లి మంగళవారం ఉదయం వరకు తండాకు చేరుకునేలా ప్రణాళిక వేసుకుంటారు. తుల్జాపూర్ నుంచి వచ్చే వరకు ప్రతి ఇంట్లోనూ అమ్మవారిని ప్రతిష్ఠించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. బియ్యం, జొన్నలు తదితర ఐదు రకాల ధాన్యం బస్తాలతో ఇండ్ల ఎదుట మండపాలను ఏర్పా టు చేసి వాటిపై కొత్త ఎర్రటి వస్ర్తాన్ని కప్పుతారు. మండపం ముందు అమ్మవారిని ప్రతిష్ఠించేందు కు బియ్యం పోస్తారు. మండపాన్ని పూలతో అందంగా అలంకరిస్తారు. తుల్జాపూర్ నుంచి వచ్చిన వారు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందే కూర్చుంటారు. పురోహితులతో అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకించిన తర్వాత కుటుంబసభ్యులు పాటలు పాడుకుంటూ తుల్జాభవానీ మాతను ఒక పాత్రలో ఉంచి తలపై పెట్టుకుని తెచ్చి మండపంలో ప్రతిష్ఠిస్తారు. అనంతరం అమ్మవారికి తీపి వంటకా లు వండి నైవేద్యాన్ని సమర్పిస్తారు. సాయంత్రం మేకపోతులను బలిచ్చి అమ్మవారి ముందు ఉంచుతారు. మాంసం వండి కుంభంపోసి నైవేద్యంగా సమర్పిస్తారు. మంగళవారం రాత్రి వచ్చిన బంధువులు, మిత్రులు, అతిథులకు మాంసాహారంతో భోజనం పెడతారు. రాత్రంతా అమ్మవారి మండపం ఎదుట పాటలు పాడుతూ భజనలు చేస్తారు. కుటుంబ సభ్యు లు రాత్రి భోజనాలు చేసిన తరువాత ఆనందంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ గడుపుతారు. బుధవారం ఉద యం మళ్లీ అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు ముగిస్తారు. కాగా పండుగకు ముందు రోజు సోమవారం ఆంజనేయస్వామిని కూడా గిరిజనులు పూజిస్తా రు. తండాల్లో పశువులు, మేకలు, గొర్రె లు ఏడాదంతా మం చిగా ఉండాలని మంగళవారం ఉదయం మంత్రాల్ పూజను నిర్వహిస్తారు.
విడిగా కాపురం పెడితే..
ఉమ్మడి కుటుంబంలో ఉండి ఎవరైనా విడిపోయి కొత్తగా కాపురం పెడితే వారు వరుసగా మూడేండ్ల పాటు పండుగ చేయడం లంబాడీకులస్తుల్లో వస్తున్న ఆచారం. ఆ తర్వాత ఏడాది నుంచి అందరిలా రెం డేండ్లకోసారి చేయాలి. కాగా ఈ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 నుంచి రూ.70 వేల దాకా ఖర్చు అవుతుంది. ఒక్కో కుటుంబంలో మొక్కును బట్టి మూడు నుంచి ఐదు మేకపోతుల దాకా కోస్తారు. రెండేండ్లకోసారి వేడుకను చేస్తారు కాబట్టి బంధువులతో లంబాడీల ఇండ్లు కళకళలాడుతుంటాయి. బతుకు దెరువుకోసం ఇతర ప్రాంతాలకెళ్లిన వారంతా పండుగకు వచ్చి కలుసుకుని ఆనందంగా గడుపుతారు. తమ ఆరాధ్య దైవం తుల్జాభవానీ మాతకు మొక్కుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని లంబాడీల విశ్వాసం. పండుగ సందర్భంగా అందరూ కొత్త దుస్తువులను ధరిస్తారు.
సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగ
దసరావ్ పండుగను మా తాత ముత్తాతల నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. అదే ఆచారాన్ని మేము కూడా కొనసాగిస్తున్నాం. గిరిజనులకు ఇదే పెద్ద పండుగ. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ తండాలకు వచ్చి పండుగను ఘనంగా జరుపుకొంటారు. తండాల్లోని ప్రతి ఇల్లూ బంధువులు, మిత్రులతో సందడి కనిపిస్తుంటుంది. మా తల్లి తుల్జా భవానీ మా తకు మొక్కుకుంటే మా కోరికలు తీరుతాయి. అందుకే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాం.
– నెహ్రూనాయక్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బొంరాస్పేట
అమ్మవారిని భక్తితో పూజిస్తాం
మేము తుల్జాభవానీ మాతను భక్తితో పూజిస్తాం. రెండేండ్లకోసారి అమ్మ వారికి పండుగను ఘనంగా నిర్వహిస్తాం. పండుగ సందర్భంగా బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకెళ్లిన వారంతా తప్పకుండా మా తండాకు వచ్చి పండుగను ఘనంగా జరుపుకొంటారు.
– సోంనాథ్, బాపల్లితండా