వికారాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గురువారం వికారాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పనులకుగాను అత్యధిక సంఖ్యలో కూలీలు హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలువగా, ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది అత్యధిక కూలీలు హాజరైనట్లు రికార్డు నమోదైంది. జిల్లావ్యాప్తంగా గత నెల మొదటి వారం వరకు రోజుకు 21 వేల మంది కూలీలు పనులకురాగా, ఈనెల మొదటి వారం నుంచి ఆ సంఖ్య పెరిగింది.
ప్రస్తుతం జిల్లాలో రోజుకు 45 వేలకుపైగా కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. ఈ నెలాఖరులోగా ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య 50 వేలు దాటుతుందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మట్టి రోడ్లు, నీట ఊట గుంతల నిర్మాణాలు, నర్సరీల్లో మొక్కలు పెంచడం తదితర పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం 59.31 లక్షల పని దినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 56.48 లక్షల పని దినాలను జిల్లా యంత్రాంగం కల్పించింది. ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు రోజుకు రూ.194 కూలీ డబ్బులను అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,83,309 జాబ్కార్డులు ఉండగా 3,77,087 మంది కూలీలుఉన్నారు.
జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య రికార్డుస్థాయిలో పెరిగింది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో 24 వేలకుపైగా కూలీలు పెరిగారు. జిల్లాలో 566 గ్రామపంచాయతీల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. ఎక్కువగా జిల్లాలోని కులకచర్ల మండలంతోపాటు బొంరాస్పేట, ధారూరు, పెద్దేముల్, యాలాల మండలాల్లో ఉపాధి పనులకు హాజరవుతున్నారు. మంగళవారం జిల్లాలోని ఆయా మండలాల్లో ఉపాధి హామీ పనులకు హాజరైన కూలీలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 45,434 మంది కూలీలు హాజరుకాగా, కులకచర్ల మండలంలో రోజుకు 3327 మంది, బొంరాస్పేట మండలంలో 3577 మంది, ధారూరు మండలంలో 2733 మంది, పెద్దేముల్ మండలంలో 2924 మంది,
యాలాల మండలంలో 2711 మంది, నవాబుపేట మండలంలో 2572 మంది, మర్పల్లి మండలంలో 2711 మంది, కోట్పల్లి మండలంలో 1516 మంది, పరిగి మండలంలో 2791 మంది, పూడూరు మండలంలో 2370 మంది కూలీలు, మోమిన్పేట మండలంలో 2339 మంది, దౌల్తాబాద్ మండలంలో 2578 మంది, బంట్వారం మండలంలో 1400 మంది, బషీరాబాద్ మండలంలో 2761 మంది, కొడంగల్ మండలంలో 2002 మంది, దోమ మండలంలో 2587 మంది, తాండూరు మండలంలో 2420 మంది, వికారాబాద్ మండలంలో 1638 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరయ్యారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకుగాను ఇప్పటి వరకు రూ.105 కోట్ల చెల్లింపులను పూర్తి చేశారు.
ఇంకుడు గుంతలు, నీటిఊట గుంతల నిర్మాణాలు, మట్టి రోడ్ల నిర్మాణ పనులను ప్రధానంగా చేస్తున్నారు. అసైన్డ్ భూముల్లోని రాళ్లను తీసివేయడం, భూమిని చదునుచేయడం, బౌండ్రీలు ఏర్పాటు చేయడం, ఎరువు గుంతల నిర్మాణం, బోరుబావి తవ్వించడం తదితర పనులు చేపట్టనున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మట్టి కట్టలు, పశువులకు షెడ్ల ఏర్పాటు, పంట కాలువల మరమ్మతులు, పంట మార్పిడి కల్లాలు, కొత్త సేద్యపు బావులు తవ్వడం, నిరవధిక సమతల కందకాలు, ఖండిత సమతల కందకాలు, పశువుల నిరోధక కందకాలు, భూసార సంరక్ష కందకాలు తదితర నిర్మాణ పనులను చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 4849 కుటుంబాలకు వంద రోజుల పనిని కల్పించారు. రెండేండ్ల క్రితం వరకు జిల్లాలో ఏటా 20 వేలకుపైగా కుటుంబాలకు వంద రోజులపాటు పనులను కల్పించగా, గత రెండేండ్లుగా కూలీల సంఖ్య ఐదు వేలకూ పెరుగకపోవడం గమనార్హం. కొడంగల్ మండలంలో 796 కుటుంబాలు, నవాబుపేట మండలంలో 532, దోమ మండలంలో 479, బంట్వారం మండలంలో 441, వికారాబాద్ మండలంలో 393 కుటుంబాలు, బొంరాస్పేట మండలంలో 294, కులకచర్ల మండలంలో 110, యాలాల మండలంలో 182, తాండూరు మండలంలో 51 కుటుంబాలు, బషీరాబాద్ మండలంలో 109, దౌల్తాబాద్ మండలంలో 126 కుటుంబాలకు, పరిగి మండలంలో 75, ధారూరు మండలంలో 206, కోట్పల్లి మండలంలో 58, మర్పల్లి మండలంలో 289 కుటుంబాలకు వంద రోజుల పనిని కల్పించారు.