ఇబ్రహీంపట్నం, మార్చి 23 : భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నానికి చెందిన క్యామ మల్లేశ్ బరిలో నిలువనున్నారు. ఈ మేరకు శనివారం పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అన్ని రకాలుగా ఆలోచించిన అధిష్ఠానం చివరిగా క్యామ మల్లేశ్ వైపే మొగ్గు చూపింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామానికి చెందిన క్యామ మల్లేశ్ ముందుగా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అధిరోహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన ఆయన 2018లో బీఆర్ఎస్లో చేరారు. అప్పటినుంచి పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పనిచేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ మన్ననలు పొందుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతో పాటు ఆయనకు బీసీ వర్గాల్లో మంచి పట్టున్నది. ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ పోరాట పటిమ కలిగిన నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. బీసీల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారు. మల్లేశ్ స్వగ్రామమైన శేరిగూడలో మొదటిసారిగా పంచయతీ సభ్యుడిగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం ఆయన స్వశక్తితో అనేక పదవులు నిర్వహించటంతో పాటు ప్రతి పనిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నమ్మిన సిద్ధ్దాంతం కోసం కష్టపడి పనిచేసే గొప్ప నాయకుడిగా పేరున్నది.
బీఆర్ఎస్తోనే సామాజిక న్యాయం..
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆయన పేరును ప్రకటించిన నేపథ్యంలో ‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడారు. అన్ని వర్గాల వారికి రాజ్యాధికారం దక్కాలన్న ఉద్దేశంతో పార్టీ అధినేత కేసీఆర్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని వారందరి సహకారంతో భువనగిరిలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. కొంతమంది అవకాశవాదంతో పార్టీని వీడుతున్నారని, అలాంటివారితో పార్టీకి జరిగే నష్టమేమీ లేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో నమ్మకంతో తనకు సీటు కేటాయించారన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే బడుగు, బలహీన వర్గాలకు సమన్యాయం లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ను విజయతీరాలకు చేరుస్తామన్నారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతులవారికి సామాజిక న్యాయం అందాలంటే బీఆర్ఎస్ను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
బయోడేటా…
పేరు : క్యామ మల్లేశ్..
భార్య : క్యామ జంగమ్మ..
కుమారుడు : అంజన్కుమార్,
కుమార్తెలు : ప్రియాంక, అవంతి, అరోణి,
స్వగ్రామం : శేరిగూడ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ…
ప్రస్తుత నివాసం : వనస్థలిపురం.
విద్యార్హతలు : ఇంటర్మీడియట్ పాస్..
నిర్వహించిన పదవులు : 1992లో ఇబ్రహీంపట్నం మార్కెట్కమిటీ చైర్మన్, 2003లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు, అలాగే, మండల యూత్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులు నిర్వహించారు.
2014లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ, 2018లో బీఆర్ఎస్లో చేరిక….