‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది కోట్పల్లి ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతుల పరిస్థితి. ఇందులో సమృద్ధిగా నీరున్నా పంటల సాగుకు వాడుకోలేని దుస్థితి నెలకొన్నది. కొన్నేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడంతో నీటి నిల్వలు మెండుగా ఉన్నాయి. అయినా కాలువలు, తూములు శిథిలావస్థకు చేరడంతో నీరు పారే పరిస్థితి లేదు. ఇప్పటివరకు కనీస మరమ్మతులకు నోచుకోకపోవడమే ఇందుకు కారణం.
-వికారాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ)
యాభై ఏండ్ల క్రితం నిర్మించిన కోట్పల్లి ప్రాజెక్టు కాలువలు పూర్తిగా దెబ్బతినడం, తూములు కొట్టుకుపోవడం, బ్రిడ్జిలు కూలిపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం చివరి బడ్జెట్లో కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు నిధులు కేటాయించడంతో అధికారులు అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేశారు. అయితే అంతలోనే ఎన్నికలు రావడంతో నిధుల మంజూరుకు బ్రేక్ పడింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ప్రాజెక్టు ఆధునీకరణ ఊసే లేకపోవడం గమనార్హం.
ఇప్పటికే అంచనాలు పూర్తి చేసి సంబంధిత శాఖ ఈఎన్సీ వద్ద ఉన్న ప్రాజెక్టు ఆధునీకరణ ఫైల్ విషయంలో వికారాబాద్, తాండూరు ఎమ్మెల్యేలు కదలిక తీసుకువస్తారో లేదో వేచిచూడాలి. మరోవైపు జిల్లాలో ఉన్న ఒకే ఒక్క మధ్యతరహా ప్రాజెక్టు ఇది అని, త్వరగా నిధులు మంజూరు చేసి సాగునీరందించాలని వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో ప్రాజెక్టులు, ప్రధాన చెరువుల నుంచి వెళ్లే కాలువలు పూర్తిగా పాడై సాగు నీరందించే పరిస్థితి లేదు. కోట్పల్లి ప్రాజెక్టుకు గత రెండుమూడేండ్లుగా భారీగా వరద వస్తుండడంతో ప్రాజెక్టు కింద ఉండే కాలువలన్నీ కొట్టుకుపోయాయి. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు నీరందిస్తున్నారు. కోట్పల్లి ప్రాజెక్టు ద్వారా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లోని 18 గ్రామాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. మరమ్మతులకు నోచుకోని కారణంగా కేవలం 7 గ్రామాల పరిధిలో కేవలం 5500 ఎకరాలకే సాగునీరు అందుతున్నది.
ఎడమ కాలువ ద్వారా రుద్రారం, గట్టేపల్లి, కుడి కాలువ ద్వారా నాగసముందర్, మాన్సాన్పల్లి, జనగాం, మంబాపూర్, మారెపల్లితండా గ్రామాలకు సాగు నీరందుతున్నది. 1.57 టీఎంసీల సామర్థ్యంగల కోట్పల్లి ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా కాలువలు, తూములు దెబ్బతినడంతో రైతులకు నష్టం జరుగుతున్నది. దీన్ని గమనించిన తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రాజెక్టు ఆధునీకరణకు గత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే స్పందించింది.
జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాష్తోపాటు అధికారుల బృందాన్ని పంపి ఏయే పనులు చేపట్టాలనే సమగ్ర నివేదికను అందజేయాలని సూచించింది. అంతేకాకుండా ప్రాజెక్టు మరమ్మతులకు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ కూడా ఇచ్చింది. దీంతో అధికారులు రూ.110 కోట్ల నిధులతో కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణతోపాటు ఆనకట్ట బలోపేతం, కుడి, ఎడమ, బేబి కాలువల పునర్నిర్మాణం, పాత బ్రిడ్జిల స్థానంలో కొత్తవి నిర్మించడం తదితర మరమ్మతులకు అంచనాలను తయారు చేశారు.
కోట్పల్లి ప్రాజెక్టు కుడికాలువ ద్వారా 8100 ఎకరాలు, ఎడమ, బేబి కాలువల ద్వారా 1100 ఎకరాలకు నీరందించే సామర్థ్యమున్నా కాలువలు, తూములు దెబ్బతినడంతో అది సాధ్యం కావడం లేదు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తే 15 వేల ఎకరాలకుపైగా సాగు నీరందించే అవకాశాలున్నట్లు జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1964లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి పెద్దేముల్ మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును కేవలం మూడేండ్లలోనే పూర్తి చేసి సాగునీరందించారు. కోట్పల్లి ప్రాజెక్టు 24 అడుగుల లోతు, 1784 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. కుడి కాలువ కింద ధారూర్ మండలంలోని నాగసముందర్, అల్లాపూర్, రుద్రారం, బూర్గుగడ్డ, గట్టేపల్లి, ఎడమ కాలువ కింద పెద్దేముల్ మండలంలోని మాన్సాన్పల్లి, బుద్దారం, పెద్దేముల్, మారెపల్లి, దుగ్గాపూర్, రుక్మాపూర్, కొండాపూర్, ఖానాపూర్, రేగొండి, మదవంతాపూర్, జనగాం, మంబాపూర్, తింసాన్పల్లి గ్రామాలున్నాయి. బేబి కాలువ కింద నాగసముందర్, బూర్గుగడ్డ గ్రామాల ఆయకట్టుకు సాగునీరందించేలా నిర్మించారు.