కొత్తూరు : టిప్పర్కు విద్యుత్ వైర్లు తగిలి కరెంట్షాక్తో డ్రైవర్ మృతి చెందిన ఘటన కొత్తూరు మున్సిపాలిటీలోని ఫాతిమాపూర్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ సయ్యద్, ప్రత్యేక సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని శాస్త్రీపురానికి చెందిన షేక్ ఇర్ఫాన్ (32) మహబూబ్నగర్ జిల్లా బాలానగర్కు చెందిన కంకర మిషన్ కాంట్రక్టర్ వద్ద టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే తిమ్మాపూర్ నుంచి చేగూర్ వరకు రోడ్డు పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఫాతిమాపూర్ వద్ద కంకర పోయడానికి ఇర్ఫాన్ వచ్చాడు. రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో కంకర పోసి ఖాళీ టిప్పర్తో రివర్స్ తీసుకొని కొంత వెనక్కు వచ్చాడు.
కానీ అక్కడ టిప్పర్ టైర్లు మట్టిలో కూరుకుపోయాయి. దీంతో ఇర్ఫాన్ టిప్పర్ జాకీ లేపితే ముందుకు వెళ్తుందనుకుని జాకీ లేపాడు. కానీ అక్కడ విద్యుత్ వైర్లు ఉండటంతో జాకీ లేపగానే 11కేవీ విద్యుత్ వైర్లు టిప్పర్కు తగిలాయి. దీంతో టిప్పర్కు విద్యుత్ సరఫరా కావడంతో డ్రైవర్ ఇర్ఫాన్కు కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. ఇర్ఫాన్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని తోటి డ్రైవర్లు తెలిపారు. అంతేకాకుండా రెండు రోజుల క్రితమే తన భార్య ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని వారు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వం దవాఖానకు తరలించామని వివరించారు.