షాబాద్, మార్చి 3: షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో మల్లన్న కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఆదివారం గ్రామంలోని మల్లన్న దేవాలయం వద్ద ఓగ్గు కళాకారుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12గంటలకు మల్లన్న, గొల్లకేతమ్మ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం మహిళలు మల్లన్న, ఎలమ్మ దేవాలయాలకు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువకుల కేరింతలతో గ్రామం మార్మోగింది. సాయంత్రం దేవాలయ ఆవరణలో అగ్గి గుండాలు తొక్కే కార్యక్రమం నిర్వహించారు.
గ్రామంలో గతేడాది నూతనంగా మల్లన్న దేవాలయాన్ని నిర్మించగా, ఈ ఏడాది నుంచి కొమురవెళ్లి మల్లన్న కల్యాణం జరిగిన తర్వాత కుమ్మరిగూడలో మల్లన్న కల్యాణం జరిపిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కల్యాణంలో పాల్గొన్నారు. దేవాలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్లు పోనమోని కేతన, పెద్దగోల్ల మల్లయ్య, మాజీ ఎంపీటీసీ పోచయ్య, గ్రామ పెద్దలు రమేశ్యాదవ్, మంచాని నారాయణరెడ్డి, కుమార్యాదవ్, కొత్తపల్లి వెంకట్రెడ్డి, అంజయ్య, శ్రీశైలం, కుమార్, శ్రీనివాస్, మల్లేశ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.