వికారాబాద్, ఫిబ్రవరి 14, (నమస్తే తెలంగాణ): కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ(కడా)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం చైర్మన్గా వికారాబాద్ జిల్లా కలెక్టర్ను, ప్రత్యేకాధికారిగా ఆర్డీవో వెంకట్రెడ్డిని నియమించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ ప్రత్యేకాధికారులు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశారు.
రోడ్ల అభివృద్ధితోపాటు మంచినీటి సౌకర్యం, మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్యను అందించేందుకుగాను పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయడంతోపాటు ఇప్పటికే జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేసిన ప్రభుత్వం, కొడంగల్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతోపాటు ఇంజినీరింగ్, జూనియర్, డిగ్రీ కాలేజీలను మంజూరు చేసింది. ప్రత్యేకంగా కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరందించేందుకుగాను ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేయడం గమనార్హం.
మరోవైపు కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇప్పటివరకు రూ.3695 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం మంజూరు చేసింది. కొడంగల్ నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటుకుగాను స్థలాల గుర్తింపు పనిలో కడా అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలను సేకరించి, వివరాలను ప్రభుత్వానికి అందజేయగా, ఏ ప్రాజెక్టు ఎక్కడ చేపట్టనున్నారనే దానిపై సీఎం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.3695 కోట్ల అభివృద్ధి పనులను మంజూరు చేసిన ప్రభుత్వం,వీటిలో ప్రధానంగా రూ.2945 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది. కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగు నీరందించే విధంగా కొడంగల్ ఎత్తిపోతల నీటిపారుదల ప్రాజెక్టును తీసుకువచ్చారు. కొడంగల్ నియోజకవర్గంతోపాటు నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలకు సంబంధిత లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగు నీరందించనున్నట్లు తెలిసింది. దీంతో కొడంగల్ నియోజకవర్గంలోని 1.20 లక్షల ఎకరాలతోపాటు మిగతా నారాయణపేట్, మక్తల్ నియోజకవర్గాలకు సాగు నీరందనున్నది.
కొడంగల్ నియోజకవర్గంలో వైద్యవిద్యను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీతో నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలను మంజూరు చేయడంతోపాటు ప్రారంభానికిగాను రూ.224 కోట్లతో పరిపాలన అనుమతులను కూడా ఇచ్చింది. కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికిగాను 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. అదేవిధంగా 60 సీట్లతో నర్సింగ్ కాలేజీ, 50 సీట్లతో ఫిజియోథెరపీ కాలేజీ, 30 సీట్లతో పారా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. అయితే పారా మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజీలను కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటు చేయనున్నారు.
అంతేకాకుండా కొడంగల్లోని 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 220 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయనున్నారు. మరోవైపు కొడంగల్ నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజీని కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఇంజినీరింగ్ కాలేజీని కోస్గిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థలాల గుర్తింపు పనిలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కూడా మంజూరుకాగా, ఒకటి బొంరాసుపేట్ మండలంలో ఏర్పాటు చేస్తుండగా, మరో కాలేజీ ఎక్కడ ఏర్పాటు చేయాలనేది నిర్ణయించాల్సి ఉంది. అదేవిధంగా మహిళా డిగ్రీ కాలేజీని కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే సంబంధిత జూనియర్, డిగ్రీ కాలేజీలను సొంత భవనాల్లోనే నిర్వహించేలా ప్రతిపాదించడంతోపాటు స్థలాలను గుర్తిస్తున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికిగాను రూ.204 కోట్ల నిధులను మంజూరు చేయగా, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికిగాను రూ.322 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా, డబుల్ రోడ్లను నాలుగు లేన్ల రోడ్లుగా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ప్రతీ గ్రామ పంచాయతీల్లోనూ సీసీ రోడ్లను వేయనున్నారు. అంతేకాకుండా అవసరమైన చోట వంతెనలను కూడా నిర్మించనున్నారు.
కొడంగల్ నియోజకవర్గంతోపాటు వికారాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధికిగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లాకు మంజూరైన మొబిలిటీ వ్యాలీ పనులను వేగవంతం చేయగా, త్వరలో మరో రెండు కాలుష్యరహిత ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ఫార్మా ఇండస్ట్రీలతోపాటు వ్యవసాయ సంబంధిత పరిశ్రమలను టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. అయితే పూడూర్, నవాబుపేట్ మండలాల్లో అసైన్డ్, ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న దృష్ట్యా సంబంధిత పారిశ్రామిక కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు తెలిసింది.
అదేవిధంగా చేపల పెంపకాన్ని మరింత ప్రోత్సహించే విధంగా కోట్పల్లిలో చేపల పెంపకానికి సంబంధించిన ఆక్వా ఇండస్ట్రీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. అదేవిధంగా అనంతగిరి ఎకో టూరిజం అభివృద్ధికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వదేశ్ దర్శన్లో భాగంగా టూరిజం అభివృద్ధి ప్రక్రియ జరుగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం అనంతగిరి టూరిజం అభివృద్ధికిగాను ప్రత్యేకంగా నిధులిచ్చేందుకు నిర్ణయించగా, అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
కొడంగల్ నియోజకవర్గానికి మంజూరు అయిన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నారు. ఈనెల 5వ తేదీనే కొడంగల్ నియోజకవర్గంలో సీఎం పర్యటన ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వాయిదా పడగా, ఈనెల 17 లేదా 18 తేదీల్లో సీఎం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిసింది. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన అభివృద్ధి పనులన్నింటికీ కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోనే ఒకేచోట శంకుస్థాపన చేయనున్నారు.