కొడంగల్ : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చే దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల విద్యుత్, మిషన్ భగీరథ అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై, అసంపూర్తిగా ఉన్న పనులు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తీర్చడంలో అధికారులు చాలా వరకు విఫలం అయ్యరన్నారు.
నేటికీ పనులు అసంపూర్తిగా ఉండటంతో వారిపై మండిపడ్డారు. గ్రామాల్లో స్తంభాలు ఏర్పాటు కాబడినప్పటికీ తీగలు బిగించకపోవడం, లో ఓల్టేజీ ఉన్న గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సర్పంచ్లను కలిసి గ్రామంలో అసంపూర్తిగా మిగిలిన పనుల జాబితా తీసుకోవాలని, నెల రోజుల్లో పనులు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే నెల కూడా రివ్యూ ఉంటుందని, అప్పటికీ పనులు పూర్తి చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదే విధంగా మిషన్ భగీరథ పనులు ఆయా గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్నాయని, ఇంటింటి నల్లా కనెక్షన్లను అందించడంతో పాటు నల్లాలకు పెడస్టల్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా గ్రామాల్లో పైపులైన్ పనులను వెంటనే పూర్తి చేసి తవ్వకం జరిపిన ప్రతి చోట మరమ్మతులు చేపట్టి ప్రజలు ఇబ్బందుల లేకుండా చేయాలని సూచించారు.
కార్యక్రమంలో మిషన్ భగరథ ఎస్ఈ వెంకటరమణ, ఈఈ పద్మజ, డీఈ శషాంక్మిశ్ర, ఏఈ ఉస్సేన్, విద్యుత్ ఏఈ రఘువీర్, ఏడీ నవీన్కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, విష్ణువర్ధన్రెడ్డి, దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, ఎంపీపీ విజయ్కుమార్, బొంరాస్పేట వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ టీఆర్ఎస్ అధికార ప్రతినిధి టీటీ రాములు, మండల అధ్యక్షుడు దామోదర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రమేశ్బాబుతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.