కేసీఆర్ సుపరిపాలన ఫలాలకు ఇప్పటికీ అవార్డులు దక్కుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు లభిస్తూనే ఉన్నది. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని గుర్తించిన కేసీఆర్ ‘పల్లెప్రగతి’కి శ్రీకారం చుట్టి పల్లెల్లో సకల వసతులు కల్పించడంతోపాటు నీటి సరంక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. భూగర్భ జలాల పెంపునకు చెరువుల్లో పూడిక తీయించడంతోపాటు ఇంకుడు, ఊట గుంతలు, చెక్డ్యాంలను నిర్మించారు. వీటి ఫలాలు ఇప్పటికీ ప్రజలకు అందుతుండగా.. ప్రతిష్టాత్మక అవార్డులు సైతం లభిస్తున్నాయి. తాజాగా జల సంరక్షణలో దక్షిణాది రాష్ర్టాల్లోనే వికారాబాద్ ఉత్తమ జిల్లాగా నామినేట్కాగా, ఉత్తమ గ్రామ పంచాయతీల్లో కులకచర్ల మండలంలోని దాదాపూరు గ్రామం నామినేట్ అయ్యింది.
-వికారాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న గ్రామ పంచాయతీలు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కేసీఆర్ చేపట్టిన ప్రగతి పనులకు అవార్డులు దక్కుతున్నాయి. జలసంరక్షణ, భూగర్భ జలాల పెంపు విభాగంలో దక్షిణాది రాష్ర్టాల్లోనే వికారాబాద్ ఉత్తమ జిల్లాగా నామినేట్ అయ్యింది. దీంతోపాటు ఏపీలోని విశాఖపట్నం జిల్లా కూడా నామినేట్ కాగా, మొదటి లేదా రెండో ఉత్తమ జిల్లా అవార్డు మన జిల్లాకు దక్కనున్నది. అదేవిధంగా ఉత్తమ గ్రామ పంచాయతీల కేటగిరీలో కుల్కచర్ల మండలంలోని దాదాపూర్ గ్రామం నామినేట్ అయ్యింది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాలే ఈ గుర్తింపు రావడానికి కారణం. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఇంటింటికీ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, నీటి ఊట గుంతలు, చెక్డ్యాంలు, ఖండిత కందకాలు, నీటి కుంటలు, ఫారం పాండ్లను తవ్వకాన్ని ఉద్యమంలా చేపట్టింది. ఇందుకోసం అధిక నిధులను వినియోగించింది. ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఇంటింటికీ ఇంకుడు గుంత నిర్మించుకునేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. వీటి ఫలాలే నేటికి ప్రజలకు అందుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కొట్లాది రూపాయాలు వెచ్చిస్తే.. కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
బీఆర్ఎస్ హయాంలో జిల్లాలోని గ్రామ పంచాయతీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడింది. ప్రత్యేకంగా నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చి కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. దీంతోని జిల్లాలోని 29 గ్రామ పంచాయతీలు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. కేసీఆర్ సర్కార్ పల్లెప్రగతిలో భాగంగా జిల్లాకు భారీగా నిధులు మంజూరు చేసింది. ప్రతి నెలా రూ.18 కోట్ల చొప్పున జిల్లాలోని గ్రామ పంచాయతీలకు అందిస్తూ వచ్చింది. ఈ నిధులను అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు, పారిశుధ్య నిర్వహణ, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లోన్కు సంబంధించిన కిస్తీలు, ప్రభుత్వ కార్యాలయాల కరెంట్ చార్జీలు తదితర వాటికి వినియోగించేవారు. అదేవిధంగా జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలతోపాటు 307 హాబిటేషన్లలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించారు.ఇలా గ్రామాలను అన్ని రకాలుగా తీర్చిదిద్దడంతో ప్రజలు దర్జాగా ఉండేవారు.
పల్లె ప్రగతి పనులో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. గ్రామానికో ట్రాలీ, ట్యాంకర్తో కూడి ట్రాక్టర్, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, కంపోస్టు షెడ్డు, పల్లెప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు వంటి మౌలిక వసతులతో పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసింది. జిల్లాలో వాకింగ్ ట్రాక్లు ఏర్పాటుకుగాను గత ప్రభుత్వం రూ.9 లక్షలను ఖర్చు చేసింది. ప్రతీ గ్రామ పంచాయతీకి కేటాయించిన 10 శాతం గ్రీన్ బడ్జెట్ నుంచి ప్రకృతి వనాల నిర్వహణకు ఖర్చు చేసేవారు. ట్రాక్టర్లతో నిత్యం గ్రామాల్లో తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడం, హరితహారం మొక్కలకు నిత్యం నీరు అందించేవారు. కేసీఆర్ సర్కార్ సకాలంలో నిధులు అందివ్వడంతో పనులు సక్రమంగా జరిగి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావు. కానీ ప్రస్తుతం నిధులు అందకపోవడంతో పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది.
బీఆర్ఎస్ హయాంలో జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు అందాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 30 కోట్లు, 2017-18లో రూ.32 కోట్లు, 2018-19లో రూ.23.12 కోట్లు, 2019-20లో రూ.89.05 కోట్లు, 2020-21లో రూ.128.22 కోట్లు, 2021-22లో రూ.114.22 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.277.72 కోట్ల నిధులను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది.