రంగారెడ్డి, జనవరి 14 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన రైతు వేదికలతో వ్యవసాయంలో సలహాలు, సూచనలు రైతుల ముంగిట్లోకి వచ్చాయి. సాగులో అధునాతన పద్ధ్దతులు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఇలా ప్రతి సమాచారమూ రైతులకు చేరింది. ఒకప్పుడు సాగుకు సంబంధించిన ఏ సమస్యకైనా మండల కేంద్రానికో.. జిల్లా కేంద్రానికో వెళ్లాల్సిన అవసరం లేకుండా.. అప్పటి ప్రభుత్వం ఊరూరా రైతు వేదికలను అం దుబాటులోకి తెచ్చింది.
జిల్లాలో వ్యవసాయ క్లస్టర్కు ఒక్కటి చొప్పున రూ.18.26 కోట్లను వెచ్చించి 83 రైతు వేదికలను నిర్మించింది. అయితే ఈ వేదికలను అన్నదాతలకు మరింత చేరువ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికొక వేదిక చొప్పున జిల్లాలో ఆరు వేదికలను వీడియో కాన్ఫరెన్స్ హాల్(దృశ్య శ్రవణ కేంద్రాలు)గా రూపకల్పన చేస్తున్నది. నిపుణులైన శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు రైతులకు అందనుండడంతో రైతు వేదికల ఉద్దేశం సంపూర్ణంగా నెరవేరనున్నది.
సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో ప్రతి సీజన్లోనూ 3 లక్షల ఎకరాలకు పైగా పంటలను రైతాంగం సాగు చేస్తూ వస్తున్నది. పెరిగిన సాగుకు అనుగుణంగా రైతులకు సేవలను మరింత విస్తృతం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ను గుర్తించి..క్లస్టర్కో ఏఈవో ను నియమించింది. ప్రతి క్లస్టర్లోనూ రైతు వేదికలను నిర్మించి ఏఈవో నిత్యం రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నది.
ఏఈవోతోపాటు కో-ఆర్డినేటర్ కోసం టేబుళ్లు, కుర్చీలు, మైక్ సిస్టంతోపాటు పలు సామగ్రిని సమకూర్చింది. ఏఈవో, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్కోసం రెండు గదులు, రైతుల సమావేశం కోసం ఒక మీటింగ్ హాల్ ఉండేలా రైతు వేదికలను సర్వాంగ సుందరంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. రైతులంతా వేదికలో కూర్చుని చర్చించుకునేందుకు అన్ని వసతులను సమకూర్చింది. రైతువేదికల నిర్వహణకోసం తొలుత ప్రతినెలా రూ.2 వేల చొప్పున చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత రూ. 9 వేలకు పెంచింది.
వానకాలం, యాసంగి పంటల సాగుపై రైతు వేదికల్లో వారానికి రెండు సార్లు (మంగళవారం, శుక్రవారం) రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధ్దతులు, యాంత్రీకరణ, చీడ,పీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఈవోలు రైతులకు సలహాలు, సూచనలను అందజేస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు మినహా మిగతా అన్ని సమయాల్లోనూ ఏఈవోలు రైతువేదికల్లో అందుబాటులో ఉంటున్నారు. వ్యవసాయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల సమాచారంతోపాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలైన రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీ పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు సంబంధిత పథకాలకు అర్హులైన వారి నుంచి రైతు వేదికగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఏవో, ఏడీఏతోపాటు జిల్లా వ్యవసాయ అధికారులు, కొన్ని సందర్భాల్లో కలెక్టర్లు సైతం రైతు వేదికల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతువేదికల లక్ష్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు జిల్లా అధికారులు మహేశ్వరం, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్(దృశ్య శ్రవణ కేంద్రాలు)ల ఏర్పాటు కోసం రైతు వేదికల వివరాలను ప్రభుత్వానికి పంపించారు.
ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే అధికారులు వాటిని ఆ దిశగా కార్యరూపంలోకి తీసుకురానున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే.. నిపుణులైన వ్యవసాయ శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు పం టల సాగు విధానం, సస్యరక్షణ చర్యలు, తెగుళ్లు.. వాటి నివారణ చర్య లు తదితర విషయాలను నేరుగా రైతులు తెలుసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ పథకాలపై ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకునే వీలు కలుగుతుంది. ఏదేమైనా.. దూరదృష్టితో కేసీఆర్ ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసిందని రైతాంగం పేర్కొంటున్నది.
బొంరాస్పేట : వ్యవసాయ రంగంలో నిపుణులు, శాస్త్రవేత్తలతో ప్రసంగాలు ఇప్పించడం, రైతుల సందేహాల నివృత్తి కోసం రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మొదటగా నియోజకవర్గానికి ఒక రైతు వేదికను ఎంపిక చేయాలని నిర్ణయించగా.. వికారాబాద్ జిల్లాలోని నాలుగు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కోసం వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
జిల్లాలో 99 రైతు వేదికలు ఉండగా కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్పేటలో, పరిగి నియోజకవర్గంలోని పూడూరులో, వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్పేటలో, తాండూరు నియోజకవర్గంలోని అంతారం రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కోసం ప్రతిపాదనలు పంపించారు. అయితే మొదటగా ఈ నెల 15వ తేదీన సంక్రాంతి పండుగ రోజు పూడూరు రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం పరికరాల బిగింపు కూడా పూర్తయింది.
వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కోసం ఎంపిక చేసిన రైతు వేదికకు ఆరు రకాల సామగ్రిని అందజేస్తున్నారు. డెల్ కంపెనీకి చెందిన మానిటర్, కెమెరా, యూఎస్బీ, ప్యానల్ స్టాండు, విద్యుత్ ఫ్లగ్, కేబుల్ను సమకూరుస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్తో పంటల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి వీలవుతుంది.