షాబాద్, ఏప్రిల్ 12 : చేవెళ్లలో నేడు జరుగనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాలలోని సభాప్రాంగణాన్ని ఆమె ఎమ్మెల్యే కాలె యాద య్య, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర యువనేత కార్త్తిక్రెడ్డితో కలిసి పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను అన్ని విధాలా ఆలోచించి నిలిపారన్నారు. 12 స్థానాల్లో 50 శాతం సీట్లు బీసీలకు ఇవ్వడం గొప్ప పరిణామమన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా గతంలో రంగారెడ్డి జడ్పీచైర్మన్గా, ఎమ్మెల్సీగా సేవలందించిన కాసాని జ్ఞానేశ్వర్కు ఇవ్వ డం ద్వారా బడుగు, బలహీన వర్గాల వారు.. బీసీలు పార్టీలకతీతంగా బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకుని.. కేసీఆర్కు బహుమతిగా ఇద్దామని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పదేండ్ల కేసీఆర్ పాలన, వంద రోజుల కాంగ్రెస్ పాలనను చూస్తే ఒక అనుభవమున్న నాయకుడు పాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నదని సబితారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో నీటి వనరులను పెంచాలనే సంకల్పంతో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. పాలమూరు ప్రాజెక్టు దాదాపుగా పూర్తి కావొచ్చిందని.. కాల్వల తవ్వకం పనులు పూర్తైతే చేవెళ్లకు సాగునీరు వస్తుందన్నారు. ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని బయటికి రావొద్దనే ఉద్దేశంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. చేవెళ్ల ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా మారిన 111 జీవోతో ఎత్తివేశారన్నారు. చేవెళ్లలో నేడు జరుగనున్న బహిరంగ సభకు ఏడు నియోజకవర్గాల నుంచి 2 లక్షల వరకు జనం వస్తారని ఆమె చెప్పారు.
సాయంత్రం 4:30 గంటలకు కేసీఆర్ సభ వేదికకు చేరుకుంటారని, ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో వచ్చి సక్సెస్ చేయాలన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త రాంబాబుయాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ బాల్రాజ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరంగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, మల్లారెడ్డి, గిరిధర్రెడ్డి, సుధాకర్యాదవ్, గోపాల్, శేఖర్ పాల్గొన్నారు.
బీసీ నేతకు అవకాశం వచ్చినందున బీసీలందరం పార్టీలకతీతంగా ఏకతాటిపైకి వచ్చి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు కృషి చేద్దాం. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేశారు. అందరికీ అండగా ఉన్నారు.
-స్వామిగౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్
బడుగు, బలహీన వర్గాల నాయకుడు కాసానిని కేసీఆర్ ఎంపిక చేయడం గొప్ప పరిణామం. జ్ఞానేశ్వర్ను గెలిపించుకుందాం. కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలి.
-కాలె యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే