రంగారెడ్డి, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల లోక్సభ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నది. జనరల్ స్థానమైన చేవెళ్లను గతంలో రెండు పర్యాయాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మూడోసారి సైతం గెలుచుకునేలా వ్యూహ రచన చేస్తున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోపాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో సమీక్షలు, సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ క్యాడర్ను సమాయత్తం చేశారు.
ఇక ప్రజా క్షేత్రంలో ప్రచార పర్వాన్ని హోరెత్తించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఈ నెల 13న చేవెళ్లలో కేసీఆర్ భారీ బహిరంగ సభ తర్వాత పార్టీ శ్రేణులు మరింత దూకుడుగా వ్యవహరించనున్నాయి. ఐదు పార్లమెంటు స్థానాలు రంగారెడ్డి జిల్లాకు అనుబంధంగా ఉండడంతో రాబోవు రోజుల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించి ప్రజలతో మమేకం అయ్యేలా రూట్ మ్యాప్ను రూపొందిస్తున్నట్లు తెలిసింది.
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను పార్టీ అధినేత కేసీఆర్ బరిలో నిలిపారు. ఇతర పార్టీలకు భిన్నంగా జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థిని వ్యూహాత్మకంగా కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఎంపీ అభ్యర్థి కాసానితో చేవెళ్ల పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో కేటీఆర్, హరీశ్రావు పలు దఫాలుగా సమీక్షలు, సమావేశాలను నిర్వహించారు.
స్థానిక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సమీక్షలు, సన్నాహక సమావేశాలు పూర్తవడంతో ఇకపై ఎన్నికల ప్రచారంపై నేతలు దృష్టి సారిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ప్రజలతో మమేకమయ్యేలా ప్రణాళికలను రూపొందిస్తున్నారు.
ముఖ్యంగా అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. వంద రోజుల పాలనలో ఎన్నికల నాటి హామీలను నెరవేర్చకపోవడం.. ఈ కొద్దిరోజుల్లోనే ఏయే వర్గాలు నిర్వీర్యమయ్యాయి? ఏయే వర్గాలు ఎలా నిర్లక్ష్యానికి గురయ్యాయి? అనే అంశాలను కూలంకుశంగా ప్రజలకు వివరించనున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి మూటగట్టుకున్న అసంతృప్తిని పార్లమెంటు ఎన్నికల్లో అనుకూలంగా మలుచుకునేలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచన చేస్తున్నది.
ఈ నెల 13న చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుండగా.. కేసీఆర్ ఈ సభకు హాజరవుతున్నారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న సభ కావడంతో నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. ఈ నెల 6న కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగా నిర్వహించిన సభకు రాహుల్గాంధీతోపాటు రాష్ట్రస్థాయి నేతలు హాజరైనప్పటికీ సభ చెప్పుకోదగ్గ రీతిలో సక్సెస్ కాలేదు. ప్రజా పాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతున్న తరుణంలో నిర్వహించిన ఈ సభకు వచ్చిన జనంలోనూ ఏమాత్రం జోష్ కనిపించలేదు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ పాల్గొంటున్న చేవెళ్ల సభను గ్రాండ్ సక్సెస్ చేసి పార్టీ శ్రేణులతోపాటు జనంలోనూ కొత్త జోష్ తీసుకొచ్చేలా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్నది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు ఛాయలు నెలకొనగా రైతులకు బాసటగా ఇటీవల కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనగామ, సూర్యాపేట, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు.
కేసీఆర్ పర్యటన పట్ల ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువగా ప్రజల మధ్యన ఉండేలా కేసీఆర్ ప్రచారంపై పార్టీ శ్రేణులు దృష్టిని కేంద్రీకరించాయి. మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, భువనగిరి, మల్కాజిగిరి లోక్సభ పార్లమెంటు పరిధిలో రంగారెడ్డి జిల్లాలోని నియోజకవర్గాలు ఉండడంతో రాబోవు రోజుల్లో అన్ని నియోజకవర్గాలను కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు చుట్టివచ్చేలా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించేందుకు రూట్ మ్యాప్ను సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ పాల్గొనే చేవెళ్ల సభ తర్వాత ప్రచారం వేడెక్కనున్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాడర్ బలమేమిటో, సత్తా ఏమిటో చూపిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.