షాబాద్, ఏప్రిల్ 10 : గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 13,224 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 848 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 644 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. అవసరమున్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపులను ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
303 గ్రామాలు, 62 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కండ్లద్దాలు, చుక్కల మందు, విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఆశాలు, ఏఎన్ఎంలు ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా చైతన్యం చేస్తున్నారు. కంటి వెలుగుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. స్థానిక ప్రజా ప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. సోమవారం జిల్లాలో 4794 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 544 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 577 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 303 గ్రామాలు, 62 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
పేదల జీవితాల్లో వెలుగులు
– ఎస్.నారాయణరెడ్డి, ఈర్లపల్లి, చేవెళ్ల మండలం
కంటి వెలుగు కార్యక్రమంతో మాలాంటి పేదల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది. సీఎం కేసీఆర్ పేదల పాలిట దైవంగా ఉన్నారు. ఊర్లోనే పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇస్తున్నారు. నాకు కండ్లు మసకగా కనిపిస్తున్నాయి. కంటి పరీక్షలు చేసి మందులు, అద్దాలు ఇచ్చారు.