షాబాద్, ఫిబ్రవరి 22 : కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. బుధవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 16,546 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న కంటి వెలుగు క్యాంపులను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి పకడ్బందీగా పరీక్షలు చేయాలని సూచిస్తున్నారు.
రంగారెడ్డిజిల్లాలో 16,546 మందికి..
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 16,546మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,528 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,436 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాలను జిల్లా, డివిజన్ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కంటి పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 5051 మందికి..
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి సమస్యలతో వచ్చే వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శిస్తున్నారు. బుధవారం జిల్లాలో 5051 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 821 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 741 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇప్పటి వరకు 134 గ్రామాలు, 34 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
మాలాంటి వారికి ఉపయోగం
గతంలో ఏ ప్రభుత్వాలు పేదల కష్టాలు పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో పేదల సంక్షేమానికి పథకాలు తీసుకొస్తుండు. ఇది శుభపరిణామం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మాలాంటి వారికి ఉపయోగపడుతుంది. చూపు ఉంటేనే ఏదైనా పని చేసుకొని బతుకుతాం. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– జి.అంతిరెడ్డి, తంగడిపల్లి, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా
పేదలకు వరం
కంటి వెలుగు కార్యక్రమం పేదలకు వరం లాంటిది. గ్రామాల్లోనే పేద ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అక్కడే అద్దాలను ఇస్తున్నారు. నాలాంటి పేద వారికి కంటి వెలుగు ఎంతో ఉపయోగపడుతుంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– పోచమ్మ, శంకర్పల్లి